సీఎం కేసీఆర్ విజన్తో అనతి కాలంలోనే ప్రభుత్వ వైద్య రంగం ఎంతో పురోభివృద్ధి చెందింది. ఎనిమిదేండ్లలో దేశంలో 71 శాతం ఎంబీబీఎస్ సీట్లు పెరిగితే, అదే తెలంగాణలో 127 శాతం పెరిగాయి. వైద్య విద్యలో 63 శాతం మహిళలు ఉంటే 37 శాతం పురుషులు ఉన్నారు. ప్రతి సంవత్సరం మహిళల సంఖ్య పెరుగుతున్నది. చివరి సంవత్సరం 61 శాతం మహిళలు ఉండేవారు, పీజీలోనూ వారే ఎక్కువగా ఉన్నారు. ఏ వృత్తికీ లేని గౌరవం ఒక్క వైద్యానికే దక్కింది. ఇది పవిత్రమైనది. వృత్తి విలువలను కాపాడుకోవాలి. వైద్యులకు ముందు వైద్యం, రోగులను బతికించడం ముఖ్యం. పేరు, డబ్బు కోసం పాకులాడకూడదు. మంచి డాక్టర్లుగా గుర్తింపు పొందితే అవి వాటంతట అవే వస్తాయి.
– ప్రతిమ వైద్య కళాశాల వార్షికోత్సవంలో మంత్రి హరీశ్రావు
కరీంనగర్ రూరల్, డిసెంబర్ 29 : వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, దానిని కాపాడుకుంటూ మంచి వైద్యులుగా గుర్తింపు పొందాలని వైద్య విద్యార్థులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి టీ హరీశ్రావు సూచించారు. గురువారం రాత్రి కరీంనగర్ మండలం నగునూర్లోని ప్రతిమ మెడికల్ కళాశాల 20వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడి పిల్లలు ఉక్రెయిన్, రష్యా వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, కానీ సీఎం కేసీఆర్ విజన్తో ఎనిమిదేండ్లలోనే వైద్యరంగం రాష్ర్టాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపిందన్నారు. జనాభా ప్రాతిపదికన మెడికల్ సీట్లు చూసినప్పుడు, దేశంలోనే అతి ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.
పీజీ సీట్లలో రెండో స్థానంలో ఉందని, మెడికల్ సర్వీసెస్లో మూడో స్థానంలో ఉందన్నారు. ఇదంతా తాను చెప్తున్న లెక్కలు కావని, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, కేంద్రం చెబుతున్నవేనని చెప్పారు. వచ్చే ఏడాది మరో ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తాయని, ప్రతి సంవత్సరం 6,600 మంది వైద్యులు విధుల్లోకి వస్తారని వెల్లడించారు. కరీంనగర్, సిరిసిల్లలో మెడికల్ కళాశాలలు రాబోతున్నాయని తెలిపారు. రాష్ట్రం వచ్చినప్పుడు కేవలం 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 2,790కి చేరిందని, ముఖ్యంగా లోకల్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 8 లక్షల 78 వేల ర్యాంకు వచ్చిన విద్యార్థికి కూడా ఈరోజు ఎంబీబీఎస్లో సీటు వస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం చాలా బలపడిందని, మారుమూల ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్యం అందుతున్నదన్నారు.
ప్రభుత్వ దవాఖానలు, మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వైద్య రంగంతో పోటీ పడుతున్నాయన్నారు. కేసీఆర్ కిట్ పెట్టిన తర్వాత ప్రైవేట్ దవాఖానల్లో ప్రసవాలు చాలా వరకు తగ్గాయని, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు కూడా కేసీఆర్ కిట్లు ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు. ఉచిత ప్రసవాలు చేసేందుకు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ముందుకు వస్తున్నాయని, సీఎం కేసీఆర్తో మాట్లాడి వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వాళ్ల ప్రాక్టికల్స్ కోసం ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు కేసీఆర్ కిట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.
మెడికల్ కళాశాలను స్థాపించి రెండు దశాబ్దాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్రావును అభినందిస్తున్నా. ఈ కళాశాల స్థాపించినప్పుడు ఇది నక్సలైట్ల ప్రాంతం. ఇక్కడ ఇలాంటి కళాశాల ఏర్పాటు చేయాలంటే భయపడేవాళ్లు. ఈ ప్రాంతంలో వైద్యులను తయారు చేయాలని మెడికల్ కళాశాలను నెలకొల్పిన ఘనత శ్రీనివాస్రావుది. ఆయన ఎప్పుడూ డబ్బుల కోసం పరుగెత్త లేదు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యాపార వేత్త. మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ఉన్న వ్యక్తి చైర్మన్గా ఉండడం ఈ కళాశాల విద్యార్థుల అదృష్టం.
డాక్టర్ల మధ్య పోటీ పెరిగింది. కార్పొరేట్ దవాఖానలు వస్తున్నాయి. ఎంత పోటీ పెరిగినా డబ్బు ప్రధానం కాదు. రోగులను బతికించడమే ముఖ్యం. ఎంత తక్కువ మెడిసిన్తో, ఎంత కచ్చితంగా వైద్యం చేశారనేది ముఖ్యం. చాలా మంది ఎంబీబీఎస్ అయిపోగానే పీజీపై దృష్టిపెడుతున్నారు. కానీ, ఇంటర్న్షిప్ చేయాలి.
మంత్రి నిరంజన్రెడ్డి ఇద్దరు బిడ్డలు వైద్యులే. ఓ కూతురు హైదరాబాద్ జిల్లాలోని కొండాపూర్ దవాఖానలో పనిచేస్తోంది. నేను ఓ రోజు మంత్రిగా విజిట్కు వెళ్లా. సాయంత్రం అనుకోకుండా నిరంజన్రెడ్డి కలిసి మా బిడ్డ కూడా కొండాపూర్ దవాఖానలోనే పనిచేస్తదని చెప్పారు. ఆశ్చర్యమేంటంటే మంత్రి కూతురునని ఎవరికీ చెప్పవద్దని ఆమె చెప్పుకొన్నదట. అలాంటి విలువలను కలిగి ఉండాలి.
ఇలాంటి మంచి కళాశాలలో చదువుకునే అవకాశం రావడం మీ అదృష్టం. ఈ సంవత్సరం 250 పీజీ సీట్లు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం 100, 150 పీజీ సీట్లు పెంచుతాం. సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లు కూడా పెంచుతాం. ఇలాంటి అనేక ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్య రంగంలో ఇన్ని విజయాలను సాధించడానికి కారణం తెలంగాణ సాధించుకోవడం, కేసీఆర్ సీఎం కావడమే. రాష్ట్రం ఏర్పడకుండా ఉంటే మన పరిస్థితి ఏమిటనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. 60 ఏండ్లలో తెలంగాణలో మూడు వైద్య కళాశాలలు ఉంటే కేవలం 8 ఏండ్లలో 14 కళాశాలలు వచ్చాయి.
మానవత్వంతో సేవలందించాలి
వైద్య విద్యార్థులు రాబోయే కాలంలో సమాజానికి మానవత్వంతో సేవలందించాలి. 2001 డిసెంబర్ 9న ప్రతిమ వైద్య కళాశాల ప్రారంభించినప్పుడు నేను కరీంనగర్లో కౌన్సిలర్గా ఉన్నా. వైద్యశాల ప్రారంభించిన 20 ఏండ్లలో సంస్థ చైర్మన్ కంటే ఎక్కువగా నేనే ఇక్కడికి వచ్చా. ప్రతిమ అందించే పుట్టినిల్లు పథకం చాలా గొప్పది. ఇది నిరుపేదలకు అండగా నిలిచింది. 2 వేలకే గర్భిణులకు నెలనెలా పరీక్షలతోపాటు ప్రసవమయ్యే వరకు సేవలందించడం చాలా గొప్ప విషయం. ప్రతిమ వైద్యసంస్థ ఎంతో మందిని వైద్యులుగా తీర్చిదిద్దింది. ఎన్నో నిరుపేదల కుటుంబాలకు అండగా నిలిచింది. తలసేమియా వ్యాధిగ్రస్తుల ఆయువు పెంచింది. కళాశాల స్వచ్ఛంద సంస్థగా నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తున్నది. కరోనా సమయంలో చికిత్స కోసం వైద్యశాలలో ప్రత్యేక హాల్ ఇచ్చి సేవలు చేసింది.
-మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ
వైద్యరంగంలో అనేక మార్పులు
తెలంగాణలో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో వైద్యకళాశాలలు తక్కువే ఉండేవి. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం వైద్య రంగంలో అనేక మార్పులు తెచ్చింది. జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నది. వైద్యులు ఎక్కడున్నా మూలాలను మరువద్దు. సగటు మనిషికి మేలు చేసేలా వైద్యం అందించాలి. యువ వైద్యుల సేవలు నిరుపేదలకు ఉపయోగపడాలి. దేశంలో వైద్యుల అవసరం మరింత ఉన్నది. అందరికీ వైద్యం అందుబాటులోకి రావాలన్న ఆలోచనలో భాగంగానే ప్రైవేట్ వైద్యసంస్థలు వచ్చాయి. ప్రతిమ వైద్యశాలతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అనేక సార్లు వైద్యశాలకు వచ్చా. ఇక్కడ మెరుగైన సేవలు అందుతున్నాయి
– సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మంత్రి
మెరుగైన వైద్యం అందిస్తున్నాం
వైద్యులు మొదటగా వైద్యశాలకు వచ్చిన ప్రతి పేషేంట్కు ప్రాధాన్యతకు ఇవ్వాలి. వైద్యశాలకు వచ్చిన ప్రతి పేషెంట్ మంచి సేవలందించాలని మేం సూచిస్తున్నాం. అదే లక్ష్యంతో మా సిబ్బంది మంచి వైద్యం అందిస్తున్నారు. 24 గంటలపాటు వైద్యసిబ్బంది, అధ్యాపక బృందం చేస్తున్న కృషి వల్లే మా సంస్థ అభివృద్ధి చెందింది. కరీంనగర్లోనే కాకుండా వరంగల్లో క్యాన్సర్ వైద్యశాలను ప్రారంభించాం. మాపై నమ్మకంతో పనిచేస్తున్న సిబ్బందికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నాం. సంస్థ ఉద్యోగుల కోసం, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. 20 ఏండ్లుగా సంస్థలో ఉన్నవారు ఫ్యామిలీతో దేశంలో ఎక్కడికి టూర్కు వెళ్లినా, యాత్రలకు వెళ్లినా సంస్థ ఖర్చులు భరిస్తున్నది. 20 ఏండ్లు పని చేసిన సిబ్బందికి లక్ష వరకు, పదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి 50 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. పిల్లల భవిష్యత్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సిబ్బంది పిల్లలకు వైద్య విద్యకు మేనేజ్మెంట్ కోటాలో ఉచితం విద్య అందించే దిశగా కృషి చేస్తున్నాం. 1100 ప్రొఫెసర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే, మా కాలేజీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు. ఇది మాపై వారికి ఉన్న నమ్మకాన్ని చెబుతున్నది.
– బోయినపల్లి శ్రీనివాస్రావు, ప్రతిమ వైద్య విజ్ఞానసంస్థ చైర్మన్
వార్షికోత్సవం సందర్భంగా మార్తాండరావు చారిటబుల్ ట్రస్టు ద్వారా ఏడుగురు ఉత్తమ వైద్య విద్యార్థులకు గోల్డ్ మెడల్స్తోపాటు లక్ష రూపాయల నగదు మార్తాండరావు సతీమణి రాజ్యలక్ష్మి అందించారు. నర్సింగ్ విద్యార్థులకు గోల్డ్ మెడల్తోపాటు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నగర మేయర్ యాదగిరి సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు. వైద్యశాల సీఈవో సీ రామచంద్రారావు, డీన్ వివేకానంద, డాక్టర్ రవీందర్రావు, డైరెక్టర్ డాక్టర్ రమేశ్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మెరుగు రాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు.