MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, జూన్ 23 : వారసత్వ సంపద గడి గురుజుల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోరుట్లలోని పురాతనమైన గడి గురుజుల భూములను రక్షించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. అధికారులు స్థలాల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ నీనో ప్రభావంతో రాష్ట్రంలో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా ప్రతీ నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వేసవిలో నీటి ఎద్దడి నివారణ అధికారులు ముందస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం అన్ని వార్డుల్లో బోరు బావులు తవ్వించాలన్నారు. మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్న కాలనీల్లో మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను పునరుద్దరించాలని సూచించారు. మున్సిపల్ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిదులకు మాట్లాడే అవకాశం కల్పించాలని తెలిపారు. కోరుట్లలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు భూముల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు అనేవి ఎన్నికల వరకే పరిమితం కావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణాభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రతినిదులు పార్టీలకు అతీతంగా సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ముంపు ప్రాంతాల్లో వరదల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అంతకుముందు అధికారులు పలు అభివృద్ధి పనుల కోసం ప్రవేశపెట్టిన పలు అంశాలను కౌన్సిల్ సభ్యులు అమోదం తెలిపారు. మున్సిపల్ సమావేశానికి హజరైన ఎమ్మెల్యేను కౌన్సిల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర, డీఈఈ అరుణ్ కుమార్, మేనేజర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, అశోక్, అధికారులు, కౌన్సిలర్లు, కో- అప్షన్ సభ్యులు పాల్గొన్నారు.