శంకరపట్నం, జనవరి 28: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు శివారులో ఏకశిల కొండపై స్వయంభూవుగా వెలసిన మత్స్యగిరీంద్రుడి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా భాసిల్లుతున్నది. ఇక్కడ బంగారు చేప రూపంలో మహావిష్ణువు భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో ఏటా రథసప్తమి సందర్భంగా నిర్వహించనున్న అధ్యయనోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అందుకు ఆలయ పాలకవర్గం, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 1న స్వామివారి కల్యాణం, 5న పౌర్ణమి నాడు జాతర, 6న నాకబలి నిర్వహిస్తారు. కల్యాణంతో పాటు జాతరకు భక్తులు పోటెత్తుతారు. ప్రసిద్ధిగాంచిన ఈ జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ప్రత్యేక పూజల్లో భాగంగా నిత్యం స్వామి వారికి సుప్రభాతం, మేలుకొలుపు, నిత్యారాధన, బాలభోగములు, ద్రావిడ ప్రబంధం, విష్ణు సహస్రనామ పారాయణం, తీర్థప్రసాద వితరణ క్రతువులు వైభవంగా నిర్వహిస్తారు. మత్స్యగిరీంద్రస్వామి వారికి భూదేవి, నీళాదేవితో జరిగే కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. కల్యాణ క్రతువు వీణవంక మండలం బేతిగల్ పద్మశాలీ వంశీయుల చేతుల మీదుగా జరుపడం ఆనవాయితీగా వస్తోంది. ఎదుర్కోళ్ల కార్యక్రమంలో భాగంగా ధ్వజ స్తంభం వద్ద వేద పండితులు విసిరే గరుడ ముద్దలు అందుకునేందుకు భక్తులు పోటీ పడతారు.
బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ
కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి బ్రహ్మోత్సవాల బ్రోచర్ను రాష్ట్ర సాంస్కతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తిమ్మాపూర్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆలయ చైర్మన్ సాగి మలహల్రావు తొలి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, శేఖర్గౌడ్, సర్పంచులు మొకిరాల కిషన్రావు, రంజిత్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మహిపాల్, నాయకులు ఉమ్మెంతల సతీశ్రెడ్డి, నర్సింహారెడ్డి ఉన్నారు.
దర్పణంలో మత్స్యావతార దర్శనం
శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని భక్తులు ఇక్కడ నేరుగా చూడలేరు. ఆలయం లోపల కుడివైపున ఉన్న ఒక గుహలో వెలసిన బంగారు చేప ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. ముదు భాగంలో స్వామివారితో పాటు భూదేవి, శ్రీనీల విగ్రహాలు ఇరుపక్కల కనువిందుగా దర్శనమిస్తాయి. స్వామివారికి కుడివైపు ఉన్న మరో గుహలో భారీ ఆకారంలో ఉన్న ఉగ్ర నరసింహస్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. ఈయనే ఈ కొండకు క్షేత్ర పాలకుడు. ఈ ఆలయానికి ఉత్తర దశలో శివాలయం, ఆ పక్కనే వీరాంజనేయస్వామి ఆలయం, కాళీమాతతో పాటు నవగ్రహాలు కలిగిన ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మరో పక్క కొండపై చక్కని కల్యాణ మండపం ఉన్నది. అలాగే రాష్ట్ర సాంస్కతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ మరో కల్యాణ మండపం నిర్మాణానికి రూ. 36 లక్షల అంచనాతో శంకుస్థాపన చేయగా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అలాగే జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణీకులకు కనిపించే విధంగా 28 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించుటకు ఇటీవలే ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆలయం నిత్యం భక్తుల సందడితో అలరారుతుంది. పండితులు ధనుర్మాసంలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి కోనేటి నీటిలో స్నానాలు చేస్తే చర్మరుగ్మతలు మాటుమాయమవుతాయని భక్తుల నమ్మకం. దీనిలోని నీటిని భక్తులు తీర్థంగా భావించి సేవిస్తుంటారు.
అధ్యయనోత్సవాలు మొదలు
ఆలయంలో శనివారం సాయంత్రం అధ్యయనోత్సవాలతో పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా శనివారం రథసప్తమి పర్వ దినాన్ని పురస్కరించుకొని శేషం మురళీధరాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు నిత్యారాధనలు చేశారు. అనంతరం స్వామి వారిని సుందరంగా అలంకరించారు. ప్రబంధ పారాయణాలను పారాయణీకులచే పఠించారు. కార్యక్రమంలో వేద పండితులు మాధవాచార్యులు, రామక్రిష్ణమాచార్యులు పాల్గొన్నారు.