మ్యాట్రీమోనీలో ఫేక్ ప్రొఫైల్తో చీటింగ్
నమ్మించి లక్షల రూపాయలు వసూలు
ఓ యువకుడి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
ఎట్టకేలకు చిక్కిన కేటుగాడు
జ్యోతినగర్, జూలై 4: ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ కేటుగాడు.. అబ్బాయిలకు కుచ్చుటోపీ పెడుతున్నాడు. తెలుగు మ్యాట్రీమోనీలో అమ్మాయి డీపీతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, నమ్మిన వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఓ యువకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎన్టీపీసీ పోలీసులు, వలవేసి మోసగాన్ని పట్టుకున్నారు. ఎన్టీపీసీ ఠాణాలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహజన్ వివరాలు వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తూర్పు సూర్యారావుపేటకు చెందిన కోమలి సూర్య ప్రకాశ్ ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో తెలుగు మ్యాట్రీమోనీలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి గూగుల్లో గుర్తు తెలియని అమ్మాయిల ఫొటోలు డౌన్లోడ్ చేసుకొని డీపీగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గత మార్చి 25న గోదావరిఖనిలోని గౌతమినగర్కు చెందిన సురేశ్ యాదవ్ ఆ నంబర్ను సంప్రదించాడు. ఈ క్రమంలో నిందితుడు దివ్యశ్రీ పేరిట సురేశ్తో చాటింగ్ చేశాడు. తర్వాత కొద్దిరోజులకు మ్యాజిక్ కాల్ యాప్ ద్వారా అమ్మాయి గొంతుతో సురేశ్తో మాట్లాడాడు.
కొద్దిరోజులకు ఇద్దరూ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు దివ్యశ్రీగా గొంతు మార్చి తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని అర్జెంట్గా మనీ కావాలని సురేశ్ను కోరాడు. ఈ క్రమంలో బాధితుడు పలు దఫాలుగా నిందితుడి బ్యాంక్ అకౌంట్లో రూ.8లక్షలు జమ చేశాడు. ఈ క్రమంలో సురేశ్ ‘నిన్ను చూడాలని అనుకుంటున్నానని’ నిందితుడిని పలుసార్లు కోరినా దాట వేస్తూ వస్తున్నాడు. సురేశ్కు అనుమానం వచ్చింది. కొద్దిరోజుల తర్వాత మళ్లీ నిందితుడు దివ్య శ్రీ వాయిస్తో ఫోన్ చేసి మనం ఇద్దరం గోవాకు వెళ్లి అక్కడే సెటిల్ అవుదామని, మా బాబాయి నీ వద్దకు వస్తాడని రూ.2లక్షలు ఇచ్చి పంపించాలని కోరాడు.
ఈ నెల 29న నిందితుడి బాబాయిగా సూర్యప్రకాశే గౌతమినగర్కు చేరుకున్నాడు. అప్పటికే విషయం తెలిసిన పోలీసులు సూర్యప్రకాశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా, అసలు విషయం బయటపడింది. మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, నిందితుడు ఇప్పటివరకు ముగ్గురిని ఇలాగే మోసం చేసినట్లు తేలిందని డీసీపీ వివరించారు. సూర్యప్రకాశ్ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో శ్రమించిన పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. ఇక్కడ గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, రామగుండం సీఐ కణతాల లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ ఎస్ఐలు జీవన్, కుమార్ ఉన్నారు.