సుల్తానాబాద్, జూన్ 23 : రైస్మిల్లర్ల భారీ కుంభకోణం బట్టబయలైంది. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.7 కోట్ల స్వాహా చేసినట్టు బహిర్గతమైంది. ఈ కేసులో తీగలాగితే రూ.158 కోట్ల స్కాం బయటపడింది. కుంభకోణానికి పాల్పడిన ఇద్దరు రైస్మిల్ యజమానులను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి పెద్దపల్లి డీసీ పీ భూక్య రాంరెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్లోని భగత్నగర్కు చెందిన బండారి మారుతి, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన సొక్కం అంజయ్య సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాలలో సౌభాగ్య ఇండస్ట్రీస్ నడిపిస్తున్నారు. వీరు 2023-24కు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా కోసం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ పెద్దపల్లి డీఎం ముప్పిడి శ్రీకాంత్తో 2023 నవంబర్ 25న ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం వీరికి 3116.360 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని అప్పగించింది. నిబంధనల ప్రకారం 2024 సె ప్టెంబర్ 30లోగా 2119.125 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి డెలివరీ చేయాల్సి ఉన్నది. కానీ, కేవలం 515.158 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించి కాలయాపన చేశారు.
ప్రభు త్వ సొమ్మును సొంత అవసరాలకు వాడుకొని, అప్పులు తీర్చుకునేందుకు సివిల్ సప్లయి అధికారు లకు తెలియకుండా ప్రభుత్వ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. దీ నిపై హైదరాబాద్ టాస్క్ఫోర్స్, సివిల్ సప్లయి అధికారులు చేసిన దాడుల్లో 1088.014 మెట్రిక్ ట న్నుల వరి ధాన్యం తక్కువగా గుర్తించారు. అనంతరం ప్రభుత్వం వారికి మూడు నెలల గడువు ఇచ్చినప్పటికీ ధాన్యం సరఫరా చేయకపోవడమే కాకుండా ఎలాంటి వివరణ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో మారుతి, అంజయ్యను కరీంనగర్లోని ఓ జిమ్లో అరెస్టు చేశారు. గతంలో నూ నిందితుడు మారుతి పలు కుంభకోణాలకు పాల్పడినట్టు డీసీపీ రాంరెడ్డి తెలిపారు. ఇల్లందకుంట పీఎస్ పరిధిలోని శ్రీరాములపల్లిలో ఉన్న సీతారామ ఇండస్ట్రీస్ ద్వారా రూ.69 కోట్లు, జమ్మికుంట పీఎస్ పరిధిలోని కోరపల్లిలో ఉన్న మహాశక్తి ఇండస్ట్రీస్ ద్వారా రూ.62 కోట్లు, సుల్తానాబాద్ పీఎస్ పరిధిలోని కాట్నపల్లిలో ఉన్న మహాశక్తి ఇండస్ట్రీస్ ద్వారా రూ.20కోట్లతోపాటు సుల్తానాబాద్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో రూ.7 కోట్లతో కలిపి మొత్తం రూ.158 కోట్లకు మోసానికి పాల్పడ్డాడని తెలిపారు. ప్రభుత్వం ప్ర జల సంక్షేమం కోసం సరఫరా చేసే బియ్యాన్ని సివిల్ సప్లయి నిధులను దుర్వినియోగం చేసే రైస్మిల్లుల యజమానులను చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కేసులో పురోగతి సాధించిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సుల్తానాబాద్ సీఐ రంజిత్రావు, ఎస్ఐ చంద్రకుమార్, పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.