కోల్సిటీ, ఫిబ్రవరి 16: సీఎం కేసీఆర్ బర్త్డే కానుకగా నిరుపేద జంటలకు అన్నీ తానై పెండ్లి చేసి సాగనంపి తన పెద్ద మనసు చాటుకున్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కేసీఆర్ పుట్టిన రోజున రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా గోదావరిఖనిలో ఏటా వినూత్న పద్ధతిలో వేడుకలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే, ఈసారి విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కోదండ రామాలయంలో నిరుపేద ఆరు జంటలకు అంగరంగ వైభవంగా పెండ్లిళ్లు చేశారు. ముందుగా సంప్రదాయ పద్ధతిలో వధూవరులు, వారి కుటుంబ సభ్యులను ఎదురుకోలుతో నెత్తిన తలంబ్రాలు, పట్టు వస్ర్తాలతో ఊరేగింపుగా ఆలయానికి వచ్చారు. తొలుత సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీనివాస కల్యాణం జరిపించారు. అనంతరం ఒకే వేదికపై నూతన వధూవరులను కూర్చోబెట్టి, పుస్తె, మట్టెలు, నూతన వస్ర్తాలు అందజేసి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వివాహం జరిపించారు.
వధూవరుల తరపున బంధు,మిత్రులకు సహపంక్తి భోజనాలు నిర్వహించారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ముఖ్యతిథిగా హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు పెళ్లి వేడుకకు గులాబీ రంగు దుస్తులు, తలపై పాగా ధరించి డ్రెస్ కోడ్తో వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు వధూవరుల తరపున బంధువులను సగర్వంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు. కాగ సాయంత్రం ఖనిలో భారీ భరత్ నిర్వహించి అమ్మాయిలను అత్తారింటికి సాగనంపారు. కార్యక్రమంలో మేయర్ అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాల్ రావు, కో-ఆప్షన్ తానిపర్తి విజయలక్ష్మి, రాష్ట్ర నాయకురాలు మూల విజయారెడ్డి, జడ్పీటీసీ నారాయణ, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.
కారణ జన్ముడు కేసీఆర్
తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చి, ప్రగతిలో ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ కారణ జన్ముడు. ఇప్పటిదాకా రాష్ర్టానికి మాత్రమే ఆయన నాయకత్వం అవసరం అనుకున్నం. కానీ ఇప్పుడు దేశం మొత్తం ఆయన కావాలని కోరుకుంటున్నది. దేశ రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షిస్తూ ఆయన బర్త్డే సందర్భంగా శ్రీనివాస కల్యాణం జరిపించడం ఆనందంగా ఉన్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ను స్ఫూర్తిగా తీసుకొని నియోజకవర్గ ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేసిన. ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని సీఎం, మంత్రులకు మాటిచ్చిన.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే