పెద్దపల్లి, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్రావు, వేణుగోపాల్రావు మాతృమూర్తి మధురమ్మ (100) కన్నుమూసింది. కోటేశ్వర్రావు చనిపోగా, ఉన్న చిన్న కొడుకును కండ్లరా చూడాలని, ఒక్కసారి గుండెలకు హత్తుకొని కన్నుమూయాలని ఉన్నదని చెప్పిన ఆ తల్లి తన కల నెరవేరకుండానే తుదిశ్వాస విడిచింది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మధురమ్మకు ముగ్గురు కొడుకులు. మొదటి కొడుకు ఇక్కడే ఉండగా, 1973లో రెండో కొడుకు కోటేశ్వర్రావు, 1977లో మూడో కొడుకు వేణుగోపాల్రావు నక్సల్స్ పంథాను ఎంచుకొని అడవిబాట పట్టారు.
స్వాతంత్య్ర సమరయోధుడైన తండ్రి వెంకటయ్య 1997లో మరణించగా అంత్యక్రియలకు కూడా రాలేదు. 2011లో జరిగిన ఎన్కౌంటర్లో కోటేశ్వర్రావు అలియాస్ కిషన్జీ మృతిచెందాడు. విగతజీవిగా కనిపించిన కొడుకును చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. అప్పటి నుంచి చిన్నకొడుకు వేణుగోపాల్రావు కోసం పరితపించింది. తాను బతికుండగా చూడాలని కలగన్నది. ‘నాకు వందేండ్లుటయి. నీకు 70 ఏళ్లు ఉంటయి. నువ్వు ఇంటిని విడిచి 45 ఏళ్లు దాటిపోయినయ్. ఇప్పుడు నీ రూపం ఎట్లున్నదో నాకు తెలియదు బిడ్డా. మీ నాన్న 25 ఏండ్ల క్రితమే నన్ను ఒంటరిని చేసి వెళ్లాడు.
బతకాలన్న కోరిక నాలో మిగిలి ఉందంటే అది నిన్ను చూడడం కోసమే. ఈ తల్లి కోరిక మన్నించు కొడుకా. చివరి రోజుల్లోనైనా నా దగ్గరికి రా బిడ్డా..’ అంటూ తుది శ్వాస విడిచే వరకు వేడుకున్నది. కానీ, కొడుకును చూడాలనే కోరిక తీరకుండానే మధురమ్మ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న మధురమ్మను మంగళవారం మధ్యాహ్నం బంధువులు పెద్దపల్లి పట్టణంలోని శివాలయం వీధిలోని ఇంటికి తీసుకొచ్చారు. సాయంత్రం వరకే ఆమె కన్నుమూసింది.