కరీంనగర్, నవంబర్7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/పెద్దపల్లి) : మంథనిలో బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, పెద్దపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై, ఆయాచోట్ల అశేషంగా తరలి వచ్చిన జనాన్ని చూసి సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రతిపక్షాల వైఖరిని దునుమాడుతూ స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఏకరువుపెట్టారు. రెండు సభల్లోనూ తనదైన శైలీలో ప్రసంగించారు. రెండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు అడిగిన డిమాండ్లను నెరవేరుస్తానని హామీ ఇస్తూనే.. మంథనిలో బీసీ బిడ్డ పుట్టమధును, పెద్దపల్లిలో మనోహర్రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు అనేక అంశాలను ప్రజల ముందు ఉంచారు. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు దుబారా అంటున్నరు? మనం ఇస్తున్న రైతు బంధు దుబారా అంటారా? దానిని కొనసాగించాలా..? వద్దా..? అంటూ ప్రశ్నించగా.. సభికులంతా చేతులెత్తి కొనసాగించాలంటూ పెద్దపెట్టున నినదించారు.
సభ మొత్తం చేతులెత్తడంతో.. ‘కెమెరాలు అటువైపు తిప్పండి’ అని కేసీఆర్ చెప్పడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. అలాగే 24 గంటల కరెంట్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రె డ్డి అంటున్నారు. అవసరం ఉన్నదా..? లేదా..? చెప్పాలని ప్రశ్నించగా.. మరోసారి రైతులంతా ఉండాలంటూ ప్రతిస్పందించారు. రైతుకు తన భూమిపైహక్కు కల్పించాలన్న లక్ష్యంతో చేపట్టిన ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలుపుతామంటున్నరు? ఉండాలా..? వద్దా..? చెప్పాలని ప్రశ్నిచడంతో కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. రాహుల్కు ఎద్దెర్కనా..? ఎవుసమెర్కనా..? అని అనడంతో సభలో మళ్లీ నవ్వులు విరిశాయి. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచిం చాలని, అభ్యర్థుల గుణగణాల్ని చూడాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా రాయి ఎవరో..? రత్నం ఎవరో.. చూసి ఓటు వేయాలని, అలాగే అభ్యర్థితోపాటు ఆ పార్టీ చరిత్రను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఆ పార్టీ ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పనులు చేసిందా..? లేదా..? అధికారంలోకి వస్తే తెలంగాణకు ఒనకూరే ప్రయోజనం ఏమిటి..? గతంలో అధికారం ఇస్తే చేసిన అభివృద్ధి ఏంటి? ఇలా అనే అంశాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
సభలు విజయవంతం
అధినేత కేసీఆర్కు మంగళవారం పెద్దపల్లి జిల్లాలో జనం నీరాజనం పలికారు. మంథని, పెద్దపల్లిలో ప్రజా ఆశీర్వాదసభలకు బ్రహ్మరథం పట్టారు. మంథని నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నుంచి, పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ఊరూవాడా ఒక్కటై కదలి వచ్చాయి. ప్రతి పల్లె నుంచి సభాస్థలి వరకు.. దారులన్నీ గులాబీ మయమయ్యాయి. ఆయాచోట్ల సీఎం కేసీఆర్ వేదికలపైకి రాగానే.. ‘కేసీఆర్ జిందాబాద్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నిజానికి అశేషంగా వచ్చిన జనాన్ని చూసిన ముఖ్యమంత్రి ఈ రెండు సభల్లోనూ చేసిన సుదీర్ఘ ప్రసంగం చేశారు. అయినా సభికులంతా ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. ప్రతిపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధించారు. మధ్యమధ్యలో సీఎం వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. కరతాళ ధ్వనులతో మద్దతు తెలిపారు. అయితే ఇప్పటివరకు ప్రతి రోజూ ఐదు గంటలకే సభలు ముగించుకొని హెలిక్యాప్టర్లో తిరిగి వెళ్తున్న ముఖ్యమంత్రి, పెద్దపల్లిలో మాత్రం హెలిక్యాప్టర్ను పంపించి, ఐదున్నర గంటల వరకు ప్రసంగాన్ని సాగించారు. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గాన తిరిగివెళ్లారు.