మామిడి పంట ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. ఆలస్యంగానైనా విరివిగా పూసిన పూతను చూసి ఆనందంలో మునిగితేలిన రైతాంగం, ఇప్పుడు కాయదశలో మాడిపోతుండడంతో ఆందోళన చెందుతున్నది. గతేడాది ఈదురు గాలులు, అకాల వర్షాలతో నష్టపోతే.. ఈ సారి సైతం నష్టాలు చవి చూడాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నది. అయితే తేనేమంచు, బూడిద తెగుళ్లు, ప్లవర్ వెబ్బర్, తామర పురుగులు ఆశించడంతోనే పూత మాడిపోతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నివారణకు తక్షణమే తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
జగిత్యాల, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): మామిడి తోటలు తెలంగాణలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లాలో కనిపిస్తాయి. దాదాపు 35 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. బంగినపల్లి నుంచి మొదలు కొని దసేరి, మల్లికా, హిమాయత్ లాంటి రకాలు ఇక్కడ సాగు చేస్తున్నారు. దేశంలోని అనేక రాష్ర్టాలోపాటు చాలా దేశాలకు ఇక్కడి నుంచి మామిడిని ఎగుమతి చేస్తున్నారు. అయితే గత సీజన్లో అసలే తక్కువ పూత రావడం, ఆపై అకాల వర్షాలు, గాలి దుమారంతో కాయలు నేలరాలి పంట దెబ్బతిన్నది.
దీనికి తోడు మంగురావడంతో నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి సీజన్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండగా రైతులు మొదట్లో నిరాశకు లోనయ్యారు. ఆలస్యంగానైనా మంచిగా వచ్చిన పూత, కాత నల్లబడిపోవడం, రాలిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జగిత్యాల జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ మామిడి రక్షణకు సలహాలు సూచనలు ఇచ్చారు.
ఈ పురుగు లార్వా దశలో ఉన్నప్పుడు లేత గులాబీరంగు లేదా తెలుపు రంగులో ఉండి బియ్యం గింజ పరిణామంలో పూతకు విపరీతమైన నష్టం కలుగజేస్తుంది. పూత అధికంగా రావడం, గుబురుగా ఉన్నప్పుడు ఈ పురుగులు గూడు అల్లుకొని పూత కాండంలోకి వెళ్లి నష్టం కలిగిస్తాయి. నివారణ కోసం పిప్రోనిల్+ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్లో పురుగు మందును 250 గ్రాములు స్ప్రే చేసుకోవాలి.
వాతావరణంలో మార్పులతో మామిడితోటలను పురుగులు తీవ్రంగా నష్టపరిచే ప్రమాదం ఉన్నది. రోజురోజుకూ వీటి ఉధృతి ఎక్కువ అవుతుంది. యాజమాన్య లోపాలతో తామర, తేనె మంచు పురుగులు ఆకుజల్లెడ గూడు పురుగులు వ్యాపిస్తాయి. పంటను చీడపీడలు ఆశిస్తే రైతులు వెంటనే ఉద్యానవన అధికారులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టాలి.
– జే ప్రతాప్ సింగ్, ఉద్యానవన శాఖ అధికారి (జగిత్యాల)
ఈ పురుగులు గుంపులు, గుంపులుగా చేరి లేత ఆకులు, పుష్పగుచ్ఛాలు, పూత, పిందెల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీంతో పూత, పిందె వడలిపోయి రాలిపోతాయి. ఈ పురుగులు విసర్జించిన తెనే లాంటి పదార్థంపై ఉన్న మసికారమైన శిలీంద్రాలు కాయపై ఏర్పడుతాయి. దీని వల్ల ఆకులు, పూత, కాయలపై నల్లని మసి ఏర్పడుతుంది. తోటల్లో కలుపు ఎక్కువగాను, వాతావరణం మబ్బుగాను ఉండి గాలిలో తేమ శాతం ఎక్కువగా, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు మామిడితోటలో ఆవహిస్తే 40 నుంచి వంద శాతం పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
ఈ పురుగు నివారణకు 500 లీటర్ల నీటికి ల్యాండ సైహలోత్రిన్+థయోమిథాక్సమ్ కాంబినేషన్లో 250 ఎం.ఎల్ పురుగు మందును పిచికారీ చేయాలి. అందుకు సంబంధించి మార్కెట్లో ఉన్న మంచి ఆలికా, జపాక్, థయో స్టార్ వంటి బ్రాండ్లను వినియోగించుకోవచ్చు. అలాగే హెక్సాకోనజోల్ ఒక లీటర్ + ప్లానోఫిక్స్ 100 ఎం.ఎల్ చొప్పున కలిపి గాలి ఎక్కువగా లేని సమయంలో స్ప్రే చేసుకోవాలి. పూతపూర్తిగా విచ్చుకోకముందే పిచికారీ చేయాలి. పూత బాగా ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల పుప్పొడి రాలిపోయి పరపరా సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశించి నష్టం వాటిల్లుతుంది.
తామర పురుగులు పిందెలపైన చేరుతాయి. వాటి చర్మం గీకి రసం పీలుస్తాయి. దీంతో పిందె రంగు మారిపోతుంది. కాయ నాణ్యత తగ్గిపోతుంది. తామర పురుగుల నివారణ కోసం ల్యాండ సైహలోత్రిన్ 1 ఎం.ఎల్ లేదా థ్రైయోమోతోక్సం 0.5 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా సోలోమాన్0.5 ఎం.ఎల్ ఒక లీటర్ నీటికి కలిపి నల్లపూత దశలో పిందెలు ఎదిగే దశలో పిచికారీ చేస్తే తామర పురుగులను నివారించవచ్చు.
ఆకులు, పూత, పిందెలు, కాయల మీద రసం పీల్చే తేనె మంచు పురుగు, పిండి నల్లి, తామర పురుగులు ఆశించినప్పుడు అవి విసర్జించే తెనే లాంటి జిగురు పదార్థం శీలింద్రాలుగా పెరిగి నల్లని మసి తెగులు వస్తుంది. కాయలు పెరిగే దశలో అకాల వర్షాలతో ఆకులపైన ఉన్న మసి తెగులు వర్షపు నీటి ద్వారా కాయలకు సోకి మసి మంగుగా మారుతుంది. నల్లని మచ్చలు ఏర్పడి అమ్మకానికి పనికి రాకుండా పోతాయి. నివారణకు ఆకులపై మసి తెగులు ఉన్నతో 100 లీటర్ల నీటికి 2 కిలోల స్టార్చ్ (గంజిపొడి) కలిపి స్ప్రే చేయాలి. చెట్టు పూ మొగ్గదశశలో ఇమిడాక్లోప్రిడ్ 0.5 మీల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ 1గ్రాము, శిలీంద్రనాశినులు అయిన సాఫ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో థయోమిథాక్సమ్ 500 లీటర్ల నీటికి 250 గ్రామలు మరియు హెక్సాకోనజోల్ ఒక లీటరు చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
చల్లని రాత్రులు, వేడి పగటి వాతావరణం ఉన్న సమయంలో పూత, పిందెపై తెల్లని పొడిలాంటి బూజు ఏర్పడుతుంది. ఈ శిలీంధ్రం ఆశించడం వల్ల పూలు, పిందెలు రాలుతాయి. నివారణకు నీటిలో కరిగే గంధకం (సల్ఫర్) 3 గ్రాములు లేదా హెక్సాకోనజోల్ 2.మీ.లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి, కొమ్మల కత్తిరింపు, సమగ్ర ఎరువులు, నీటి, చీడపీడల యాజమాన్యం, సకాలంలో, సరైన మోతాదులో చేస్తే ప్రస్తుతం ఉన్న బూడిద తెగులు నుంచి పంటను రక్షించుకోవచ్చు.
కాతకు వచ్చే తరుణంలో పిందెలు రాలకుండా తగ్గించడానికి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫ్లానోఫిక్స్ కలిపి పూరెమ్మలు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. లేదా 2,4-డీ 10పీపీఎం ద్రావణాన్ని పిచికారీ చేయాలి.