గన్నేరువరం, అక్టోబర్ 25: కాంగ్రెస్వి భరోసా లేని పథకాలని, పగటి వేషాలు వేస్తూ ప్రజలను మాయమాటలతో మోసం చేయాలని చూస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసి సామాన్య ప్రజానీకానికి అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్నదాతల సంక్షేమానికి పెద్ద పీట వేశామని తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు.
మండలంలోని జంగపెల్లి గ్రామంలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మానకొండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, తెలంగాణ సాంసృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ హాజరయ్యారు. కాగా బతుకమ్మలు, బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. రసమయి మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడారు. కాంగ్రెస్ అసమర్థ పాలనకు కర్ణాటకలో తలెత్తుతున్న పరిస్థితులే తాజా నిదర్శనమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బుట్ట దాఖలు చేయడం, ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం కాంగ్రెస్, బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
కర్ణాటకలో పంటలు ఎండిపోతున్నప్పటికీ అకడి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని వాగ్దానం ఇచ్చి… బస్సుల్లో పురుషులు మాత్రమే ప్రయాణించాలని బోర్డులు పెట్టడంపై మండిపడ్డారు. తెలంగాణ ముందు రైతులు పొలాలను బీళ్లు పెట్టి గల్ఫ్ దేశాలు, ముంబాయి, భీవండి, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు బతుకుతెరువు కోసం వలస వెళ్లే వారని వాపోయారు. రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. నెర్రెలు బారిన నేలకు ఎర్రటి ఎండలో కూడా సాగునీళ్లు అందించారని కొనియాడారు.
కాంగ్రెస్ పాలనలో 200 పింఛన్ ఉండేదని, కేసీఆర్ సీఎం అయ్యాక దివ్యాంగులకు 4016, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు 2016 ఇస్తున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛన్ 6016, ఆసరా పింఛన్ 5016 చేస్తామని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం ఎకరాకు 6వేలు చేస్తామని, ప్రతి కుటుంబానికి రైతుబీమా మాదిరిగా 5లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా ఆశీర్వాద సభలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, సర్పంచ్ అటికం శారద శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు మోహన్ రెడ్డి, గుడెల్లి ఆంజనేయులు, మన్మోహన్ రావు, మహేందర్ రెడ్డి, వెంకట రమణరెడ్డి, మల్లేశం, శ్రీనివాస్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.