వర్షాకాలం వచ్చేసింది. ఇటీవల దంచికొడుతున్న వానలకు మలేరియా, టైఫాయిడ్, డయేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు నిర్వహించడంతోపాటు రోగాల బారీన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది.
– జమ్మికుంట, జూలై 29
వానకాలమంటేనే వ్యాధుల సీజన్. ఇటీవల కురిసిన భారీ వర్షానికి వాతావరణం మొత్తం మారిపోయింది. చల్లగా ఉంటున్నది. గుంతల్లో నీరు నిలిచిన ప్రదేశాలతో పాటు మురుగు కాల్వల్లోనూ దోమలు, ఈగల వ్యాప్తి ఎక్కువవుతుంది. ముఖ్యంగా కలుషిత నీరు తాగడం వల్ల రోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా రోడ్ల మీద ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
నడుం బిగించిన అధికారులు
పట్టణంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది 30 వార్డుల్లో పర్యటిస్తున్నారు. వరదకు కొట్టుకొచ్చిన చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. కాలువలు శుభ్రం చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో కూడా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మురుగు నీరు నిలువకుండా గుంతలు పూడ్చి వేస్తున్నారు. ఫాగింగ్ చేస్తున్నారు. డ్రై డే పాటిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది
జమ్మికుంట పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. అలాగే మండలంలోని వావిలాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. సీహెచ్సీ, పీహెచ్సీలకు చెందిన వైద్యాధికారులు డాక్టర్ రమేశ్, డాక్టర్ సనా జవేరియా ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రజలను కలుస్తున్నారు. రోగాలపై అవగాహన కల్పిస్తున్నారు. వైద్యాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య సిబ్బంది వైద్యశాలల్లో అందుబాటులో ఉంటున్నారు. పునరావాస కేంద్రంతో పాటు కస్తూర్బా, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నారు. అవసరమున్న రోగులకు మందులు అందిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ర్యాలీలు తీస్తున్నారు.
ఇలా చేస్తే సేఫ్
ఇంటి లోపల, పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. గుంతలను పూడ్చుకోవాలి. అందులో నీరు నిల్వ లేకుండా చూడాలి. డ్రైనేజీలను క్లీన్ చేయించాలి. వారంలో ఒక రోజు డ్రై డే పాటించాలి. నీటిని పారబోసుకోవాలి. మరుసటి రోజు నీరు ట్యాంకుల్లో నింపుకోవాలి. ఇంట్లో తలుపులు, కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయించుకోవాలి. దీంతో ఇంట్లోకి దోమలు, ఈగలు, క్రిమి, కీటకాలు చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా పడక గదిలో దోమ తెరలు వాడాలి. ఖాళీ బొండాలు, టైర్లు, గుంతలు, కాలువలు దోమల ఆవాసాలు. కాబట్టి వాటిని తొలగించాలి. ఇక జ్వరం 24గంటలకు మించి తగ్గకుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
జాగ్రత్తలు తీసుకుంటే చాలు
వానలు పడుతున్నాయి. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. వ్యాధులు రాకుండా ఉంటాయి. పగలు కుట్టే ఎడిస్ దోమ వల్ల డెంగీ వస్తుంది. కలుషితమైన నీటితోనూ జ్వరం ప్రబలుతుంది. ఒక రోజుకు మించి జ్వరం ఉంటే వెంటనే దవాఖానకు రావాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సొంత వైద్యం వద్దు. వైద్యం అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నం.
– డాక్టర్ సనా జవేరియా, వావిలాల పీహెచ్సీ వైద్యాధికారి
దోమల్లేకుండా చేస్తున్నం
మున్సిపల్ కమిషనర్, మా అధికారులు, సిబ్బంది, పాలకవర్గ సభ్యులంతా కాలనీల్లో తిరుగుతున్నం. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నం. ఇబ్బందుల్లేకుండా చూస్తున్నం. వరద బాగా వచ్చిన ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా చేస్తున్నం. వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నం. ఫాగింగ్తో దోమల్లేకుండా చేస్తున్నం.
– తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్