మెట్పల్లి, ఏప్రిల్8 : మెట్పల్లి నియోజకవర్గ మక్క రైతులు కన్నెర్ర జేశారు. పంట చేతికొచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంపై భగ్గుమన్నారు. సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మొరపెట్టుకుంటున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ బుధవారం మెట్పల్లి పట్టణంలో రోడ్డెక్కారు. శాస్త్రీచౌక్ వద్ద 63వ జాతీయ రహదారిపై మండుటెండలో ధర్నా చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ, కేంద్రాల ప్రారంభం రేపు.. మాపు అంటూ ప్రకటనలు ఇస్తున్నారనే తప్ప క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేయడం లేదని ఆగ్రహించారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలో మంత్రి వచ్చి ప్రారంభించినా, ఇప్పటివరకు ఒక్క కిలో మక్కలు కొనలేదని విమర్శించారు. కొనుగోళ్లలో జాప్యంతో దళారులు రెచ్చిపోతున్నారని, మద్దతు ధర క్వింటాల్కు 2400 ఉంటే 1600 నుంచి 1800 వరకు మాత్రమే చెల్లిస్తుండడంతో తాము నష్టపోతున్నామని వాపోయారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి మండలానికి ఒకటి లేదా రెండు సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధరతో మక్కలు కొనాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా రైతులను సంఘటితం చేసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. ఇక్కడ రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేశ్రెడ్డి, ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు మారు మురళీధర్రెడ్డి, ఆకుల రాజారెడ్డి, గడ్డం రాజారెడ్డి, శేఖర్రెడ్డి, సురేశ్, మోహన్, మల్లేశ్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, మల్లాపూర్ మండలాల రైతులు పాల్గొన్నారు.