సిరిసిల్ల, డిసెంబర్ 10: ‘అందరూ చదవాలి..అందరూ ఎదగాలి’ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సర్కారు బడి బయట పిల్లల గుర్తింపు సర్వేకు శ్రీకారం చుట్టింది. బాలబాలికలను గుర్తించి స్కూళ్లలో చేర్పించే ఉద్దేశంతో రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేడు డిసెంబర్ 11 నుంచి వచ్చేనెలా 10 వతేదీ వరకు సర్వే నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రాపవుట్స్, బడికి వెళ్లనివారిని గుర్తించి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు ప్రబంధ పోర్టల్ను రూపొందించారు.
ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి కాంప్లెక్స్ పాఠశాల పరిధిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు( సీఆర్పీలు) ఈ బాధ్యతను అప్పగించారు. జిల్లాలో 337 ప్రాథమిక పాఠశాలలు, 38ప్రాథమికోన్నత పాఠశాలలు 131 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సీఆర్పీలు బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారి వయస్సును బట్టి ఆయా స్థాయి పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది. గత విద్యాసంవత్సరం నిర్వహించిన సర్వేలో దాదాపు 40 మంది పిల్లలను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేశారు. వీరందరిని సమీపంలోని స్కూళ్లల్లో చేర్పించారు.
నేటి నుంచి సీఆర్పీలు తమ పరిధిలోని గ్రామాల్లో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. సర్వేలో బడి బయట ఉన్న 6 నుంచి 14 ఏండ్ల వరకు, 15 నుంచి 19 ఏండ్ల వరకు పిల్లలను గుర్తించి విద్యాశాఖ అధ్వర్యంలో రూపొందించిన ప్రబంధ్ పోర్టల్లో వివరాలు నమోదు చేయనున్నారు.