రాయికల్, ఏప్రిల్ 9: అల్లీపూర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికి గాయాలు కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల స్కూల్లో సోమవారం 6వ, 7వ తరగతి విద్యార్థులు గొడవపడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో ఇద్దరు గాయపడ్డారు. అయితే మంగళవారం ఉగాది సెలవు దినం కావడంతో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలకు గాయాలను చూసి ఆందోళన చెందారు.
ఘటన గురించి ఉపాధ్యాయులు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులం ఎదుట రాయికల్ జగిత్యాల రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. టీచర్ల పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. గురుకులంలో నిత్య పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. రాయికల్ ఎస్ఐ అజయ్ అక్కడికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. తల్లిదండ్రులు, గురుకుల ఉపాధ్యాయులతో మాట్లాడి సంఘటన వివరాలు సేకరించారు.