‘హరహర మహాదేవ..’ ‘శంభోశంకర..’ అంటూ శివనామస్మరణతో ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా వేములవాడ రాజన్న క్షేత్రం 2 లక్షల మందితో పోటెత్తింది. ఎటు చూసినా జనసందోహమే కనిపించింది. కాగా, అనువంశిక అర్చక కుటుంబాలకు చెందిన అగ్రహార బ్రాహ్మణులతో ఆలయంలోని అద్దాల మండపంలో ‘మహాలింగార్చన’, అర్ధరాత్రి 11 మంది రుత్వికులతో లింగోద్భవ ఘట్టాన్ని నిర్వహించగా, భక్తులు తిలకించి పులకించిపోయారు. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు శైవ క్షేత్రాలకు వెళ్లి పూజలు చేశారు.
– వేములవాడ టౌన్/కమాన్ చౌరస్తా, మార్చి 8
మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు పోటెత్తాయి. వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉమ్మడి జిల్లాలోని వేములవాడ రాజన్న, సారంగాపూర్లోని దుబ్బరాజన్న, కరీంనగర్ పాత బజార్ శివాలయం, గోదావరిఖని శివారులోని జనగామ శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి, కోటిలింగాల ఆలయాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఈ ఒక్కరోజే సుమారు 2లక్షల మందికిపైగా తరలివచ్చారు.
రాయేశుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు. తలనీలాలతోపాటు బంగారం(బెల్లం) మొక్కులను కూడా సమర్పించారు. గంటలపాటు క్యూలో నిల్చుండి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, భక్తుల రద్దీ దృష్ట్యా గర్భగుడిలో అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు. సాయంత్రం పట్టణంలోని అనువంశిక అర్చక కుటుంబాలకు చెందిన అగ్రహార బ్రాహ్మణులతో ఆలయంలోని అద్దాల మండపంలో మహాలింగార్చనను వైభవంగా నిర్వహించారు.
366 లింగాలు, 366 జ్యోతులను అలంకరించి వేదమంత్రాలతో పూజలు చేశారు. దాదాపు రెండున్నర గంటలపాటు కార్యక్రమం జరుగుతున్నంత సేపు భక్తులు శివనామస్మరణ చేశారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో దాదాపు 128 కుటుంబాలకు చెందిన బ్రాహ్మణులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే రాత్రి 11.30 గంటలకు లింగోద్భవకాలంలో ఆలయ గర్భగుడి ముందు 11మంది రుత్వికులతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటల నుంచి శివార్చనను నిర్వహించారు.