మానేరు వాగు తల్లడిల్లుతున్నది. ఇసుక తోడేళ్ల దోపిడీతో ఆనవాళ్లు లేకుండాపోతున్నది. అనుమతుల్లేకుండా కొందరు, అనుమతుల పేరిట మరికొందరు పగలనకా, రాత్రనకా తోడేస్తుండడంతో ప్రకృతి సంపద కనుమరుగైపోతున్నది. జమ్మికుంట మండలం కేంద్రంగా జోరుగా సాగుతున్న ఈ ఇసుక దందా, అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నది. రెవెన్యూ యంత్రాంగం రవాణాపై కన్నెత్తి చూడడం మానేయగా, మాఫియా మరింత బరితెగించింది.
ఒకే సారి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ‘రేసింగ్’ తరహాలో నడిపించుకుంటూ వెళ్లడమే కాదు, ఎవరైనా ప్రశ్నిస్తే బండ్లు మీదికి ఎక్కిస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ట్రాక్టర్ల రేసింగ్లను భరించలేని మడిపల్లి గ్రామానికి చెందిన ప్రజలు ఆగ్రహంతో రెండ్రోజుల కింద పదుల సంఖ్యలో వాహనాలను అడ్డుకున్నానారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా ఒక్క ట్రాక్టర్ను కూడా పట్టుకోలేకపోవడం, ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంపై మండిపడుతున్నారు.
జమ్మికుంట, మే 26 : జమ్మికుంట మండలంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించకపోవడంతో మానేరు నుంచి ఇసుకను అందినంత దోచుకుపోతున్నారు.
మానేరు పరీవాహక ప్రాంతానికి సమీపంలో విలాసాగర్, తనుగుల, గండ్రపల్లి, తదితర గ్రామాలున్నాయి. మానేరులో ఇసుక ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు అడ్డగోలుగా ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. నిత్యం వందల ట్రాక్టర్లలో ఇసుక నింపుకుని జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, హన్మకొండ, వరంగల్, తదితర సుదూర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. అయితే, కొత్తగా వచ్చిన సీపీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కొద్ది రోజుల పాటు ఇసుకపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇసుకాసురులకు కౌన్సెలింగ్లు ఇచ్చారు.
దొరికిన ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, ఇటీవల మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోయింది. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఒకేసారి రోడ్డు మీదకు వస్తున్నాయి. రయ్.. రయ్మంటూ తోలుకుంటూ పోతున్నారు. అయితే, ట్రాక్టర్ డ్రైవర్లలో చాలామంది మైనర్లు ఉంటున్నారు. రోడ్ల మీద ప్రజలు నడవాలన్నా, వాహనాలపై వెళ్లాలన్నా, భయాందోళనకు గురవుతున్నారు. రోడ్లపై ట్రాక్టర్ల రేసింగ్లను భరించలేని మడిపల్లి గ్రామానికి చెందిన ప్రజలు మర్లబడ్డారు. శనివారం పదుల సంఖ్యలో వాహనాలను అడ్డుకున్నారు. ప్రశ్నించారు. పోలీసులకు సమాచారం అందించారు. అయినా పోలీసులు ఒక్క వాహనాన్ని కూడా పట్టుకోలేకపోయారు.
కొన్ని నెలల క్రితం అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కొరడా ఝులిపించారు. కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక అవసరమున్న వినియోగదారుడు మీ సేవ కేంద్రంలో చలాన్లు తీసిన తర్వాతే ఇసుక రవాణా జరిగేది. అలా కొద్ది రోజులు సజావుగా సాగింది. అయితే, ఇందులో చలాన్లు తీసిన వినియోగదారునికి దొడ్డు ఇసుక సరఫరా చేసిన ఇసుకాసురులు, సన్నం ఇసుకను బ్లాక్ చేశారు. సదరు ఇసుకను ఎక్కువ ధరలకు అమ్ముకుని దందా సాగించారు. కొంతలో కొంత ప్రభుత్వానికైతే ఆదాయం వచ్చింది. అక్కడ వరకు బాగానే ఉంది.
ఇటీవల ఇసుకపై అధికారులెవరూ పట్టించుకోపోవడంతో ఇన్నాళ్లూ నిల్వ ఇసుక డంపులను తోడుకుని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. జమ్మికుంటకు ఒక్కో ఇసుక ట్రాక్టర్కు రూ.3 వేలు, దూర ప్రాంతాలకై రూ.10 వేలకు పైగా విక్రయిస్తున్నారు. వెరసి ప్రభుత్వాదాయానికి కోట్లలో గండి పడుతోంది. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు, సిబ్బంది పాత్రపై ఉన్నతాధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్లున్నాయి. లేకపోతే ఇంతలా రెచ్చిపోతున్న ఇసుక మాఫియాపై చర్యలెందుకు తీసుకోవడం లేదంటున్నారు. ఏది ఏమైనా ఇసుక అక్రమ రవాణా, ర్యాష్ డ్రైవింగ్లను అరికట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇసుక కావాలంటే పర్మిషన్లు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనింగ్ డిపార్ట్మెంట్కు చలాన్ కట్టాలి. అంతే కానీ, అక్రమంగా తీసుకెళ్ల కూడదు. ఇప్పటి వరకైతే ఇసుక అక్రమ రవాణా మా దృష్టికి రాలేదు. ఏం జరుగుతుందో తెలుసుకుంటా.
– విజయ, జమ్మికుంట తహసీల్దార్
ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టినం. కేసులు నమోదు చేస్తున్నం. మమ్మల్ని కనిపెట్టుకుంటూ రవాణా చేస్తున్నరు. అయినా, ఎవరినీ వదిలిపెట్టేది లేదు. నిఘా పెడుతున్నం. గస్తీ తిప్పుతం. అవసరమైతే ఇసుక అక్రమార్కులపై రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసేందుకు వెనుకాడం.
– వీ రవి, జమ్మికుంట టౌన్ సీఐ