కరీంనగర్ రాంనగర్, ఫిబ్రవరి 19: మమ్మీ కాలేజీకి వెళ్లొస్తానంటూ సంతోషంగా బయలు దేరిన డిగ్రీ విద్యార్థిని అంతలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇంటి నుంచి స్కూటీపై వెళ్లిన కాసేపటికే లారీ ఢీకొని మృత్యుఒడికి చేరింది. ఇంటి నుంచి సంతోషంగా వెళ్లిన బిడ్డ ఇలా విగతజీవిగా మారడం చూసి కుటుంబసభ్యులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ మండలం గోపాల్పూర్కు చెందిన వాసని జగ్దీశ్, రసీలకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. అందులో పెద్ద కూతురు దియా పటేల్ (19) అల్ఫోర్స్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నది. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 9గంటల ప్రాంతంలో తన సూటీపై బయలుదేరింది.
ఇంటి నుంచి వెళ్లిన కొద్ది సేపటికే బొమ్మకల్ ఫె్లైఓవర్ చౌరస్తా వద్ద గోదావరిఖని నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో సూటీపై ఉన్న దియా పటేల్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే 108 ద్వారా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అకడి వైద్యుల సూచన మేరకు ఆమెను వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే, అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ ప్రదీప్ తెలిపారు.