Kamanpur | కమాన్పూర్, ఆగస్టు 8 : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో స్వయంభూ శ్రీ ఆదివరాహస్వామి జయంతోత్సవాలను ఈనెల 23 నుంచి 26 వరకు వైభవంగా నిర్వహించునున్నట్లు ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కాంతారెడ్డి, ప్రధాన అర్చకులు వరప్రసాదాచార్యులు కోరారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని ఆదివరాహ స్వామి క్షేతం వద్ద శనివారం స్వామి వారి జయంతోత్సవాలకు సంబందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు.
23న విష్ణుసహస్రనామ పారాయణం, అంకురార్పణ, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, 24న నిత్యాభిషేకం, గోపూజ, ఆదివరాహ హోమం చేపడతామన్నారు. 25న స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. 26న జయంతి సందర్భంగా అష్టోత్తర శతనామావళి, 108 కలశాలతో అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయన్నారు. తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెకర్లు పాల్గొన్నారు.