సార్వత్రిక ఎన్నికల సమరంలో తుది ఘట్టానికి ఈసీ సిద్ధమవుతున్నది. ఇటీవలే ఓటింగ్ పూర్తయిన నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు వచ్చే నెల 4న జరిగే కౌంటింగ్కు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కింపు కొనసాగనుండగా, సెగ్మెంట్కు ఒక్కో హాల్ను కేటాయించి, అవసరమైన టేబుళ్లు, ఆయా పార్టీల ఏజంట్లు పరిశీలించేలా ఇనుప జాలీలతో కూడిన లైనింగ్స్ను నిర్మించింది. మొత్తంగా రెండు లోక్సభ స్థానాలకుగాను 1,240 మంది సిబ్బందికి విధులు కేటాయించి, ర్యాండమైజేషన్ కూడా పూర్తిచేసింది. ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విధానంపై సోమవారం ఆయా కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్లలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది.
కరీంనగర్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కలెక్టరేట్ : లోక్సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల13న ముగిసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగనున్నది. అందుకు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఉమ్మడి జిల్లా ఎన్నికల అధికారులు లెక్కింపు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కించనుండగా, ఒక్కో అసెంబ్లీకి ఒక్కో హాల్ను కేటాయించి, అందులో అవసరమైన టేబుళ్లు, లెక్కింపును ఆయా పార్టీల ఏజెంట్లు పరిశీలించేలా ఇనుప జాలీలతో కూడిన లైనింగ్స్ నిర్మాణం కూడా పూర్తి చేశారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 1,240 మంది సిబ్బందికి విధులు కేటాయించారు. వీరికి అవసరమైన శిక్షణ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి కాగా, ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విధానంపై కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల సంఘం సూచనల మేరకు సమగ్ర విధానం రూపొందించారు. పకడ్బందీగా ఓట్లు లెక్కించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, కరీంనగర్ మినహా మిగతా 13 సెగ్మెంట్లకు 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసి లెక్కించనున్నట్టు తెలిపారు. ఇక కరీంనగర్లో పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేకంగా 2 టేబుళ్లు, పెద్దపల్లిలో ఒక టేబుల్ కేటాయించనున్నారు. కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో అత్యధిక ఓటర్లుండడంతో 18 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ లోక్సభ ఓట్ల లెక్కింపు నగరంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించనుండగా, పెద్దపల్లి లోక్సభ ఓట్ల లెక్కింపు మంథనిలోని జేఎన్టీయూలో చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపులో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో పాటు గ్రూప్ డీ సిబ్బంది కూడా పాల్గొననున్నారు. ఈవీఎంల లెక్కింపులో ఒక్కో టేబుల్కు సీఎస్, సీఏ, ఎంఓలు ఒక్కొక్కరు చొప్పున, ఇద్దరు గ్రూప్ డీ సిబ్బందిని కేటాయించారు.
కరీంనగర్ లోక్సభ ఓట్ల లెక్కింపుకు 673 మంది, పెద్దపల్లిలో 567 మందిని వినియోగించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కరీంనగర్ లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చేపట్టనుండగా, పెద్దపల్లిలో మాత్రం 26 టేబుళ్లు ఏర్పాటు చేసి ఒకేసారి లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. 12,897 పోస్టల్ బ్యాలెట్లు పోలవగా, వీటిని లెక్కించేందుకు 10 స్కానర్లు, 10 లాప్టాప్లు ఉపయోగించనున్నారు. ఒక్కో టేబుల్కు ఒక ఏఆర్వోతోపాటు ఒక సీఎస్, ఇద్దరు సీఏలు, ఒక ఎంవో, 14 మంది ఇతర సిబ్బందిని వినియోగించనున్నారు. లెక్కింపు సందర్భంగా కేంద్రాల సమీపంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందితో పాటు నాలుగు కంపెనీల పారామిలటరీ బలగాలను కూడా భద్రతకు వినియోగిస్తున్నామని ఎన్నికల అధికారులు వెల్లడిస్తున్నారు.
ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా గు ర్తింపు కార్డులు అందించనున్నారు. మూడంచెల భద్రతా విధానంలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, గుర్తింపుకార్డులున్న వారిని మాత్రమే లెక్కింపు టేబుళ్ల వద్దకు అనుమతించనున్నారు. లెక్కింపు విధుల్లో వారికి జిల్లా ఎన్నికల అధికారి కార్డులు జారీ చేయనున్నారు. కాగా, లెక్కింపు కేంద్రాల్లో విధు లు నిర్వహించే సిబ్బంది కూడా తమ వెంట మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, లెక్కింపు కేంద్రంలో వివిధ అవసరాల కోసం మొబైల్స్ వినియోగం తప్పనిసరి కాగా, ఈవీఎం స్ట్రాంగ్రూముల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి మినహాయింపునివ్వాలంటూ ఉన్నతాధికారులను కోరినట్లు తెలుస్తున్నది.