జూన్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం
ఈ నెల 24న పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రచురించాలి
జిల్లా అధికారులతో ఎస్ఈసీ సీ పార్థసారథి సమీక్ష
కలెక్టరేట్, మే 17: ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రాబోయే జూన్లో స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలున్నాయని ఎస్ఈసీ సీ పార్థసారథి తెలిపారు. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీ పార్థసారథి మంగళవారం నగరంలో సమీక్షించారు. వివిధ కారణాలతో జిల్లాలో ఖాళీ అయిన సర్పంచ్, వార్డు సభ్యులు, మండల ప్రాదేశిక సభ్యులు, మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో మొత్తం రెండు సర్పంచ్, నాలుగు ఉప సర్పంచ్, 31 వార్డు సభ్యులు, రెండు ఎంపీటీసీ స్థానాలు, ఒక మండల ఉపాధ్యక్ష స్థానం, కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్ స్థానం ఖాళీగా ఉన్నట్లు అధికారులు వివరించారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఇప్పటికే ఓటర్ల జాబితాలు సిద్ధం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా కూడా ప్రచురించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ మాట్లాడుతూ, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటులో ఎలాంటి అభ్యంతరాలున్నా వాటిని సత్వరమే పరిష్కరించి, ఈ నెల 24న తుది జాబితా ప్రచురించాలని ఆదేశించారు. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి నేరుగా నగరానికి చేరుకున్న ఆయనకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ, డీపీవో వీరబుచ్చయ్య, జడ్పీ సీఈవో ప్రియాంక తదితరులు పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్ఈసీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.