కలెక్టరేట్, జనవరి 3 : దేశాన్ని మతోన్మాద దేశంగా మారుస్తున్న బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని పీఠిక నుంచి సెక్యులరిజం, సోషలిజం పదాలు మాయమవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది కోట్ల విలువైన సంపదను సర్వనాశనం చేస్తూ దేశ ప్రజలను అన్యాయానికి గురి చేస్తున్నదని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో నయాభారత్ నిర్మాణం కోసం అడుగులు వేద్దామని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు.
నిరంతరం మానవజాతి సమస్యలపై స్పందించే గొప్ప విధానమే కమ్యూనిజమని, మానవజాతిని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతమే మార్క్సిజం అని పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కరీంనగర్ జిల్లా మొదటి పార్లమెంటు సభ్యు డు బద్దం ఎల్లారెడ్డి 44వ వర్ధంతి సభకు ఆయన హాజరై, మాట్లాడారు. వామపక్ష నాయకులు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అనేక మంది పోరాటాల వల్లే దేశం, రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలకు కారణం కమ్యూనిస్టుల పోరాటాలేనని స్పష్టం చేశారు. ఎవరికైనా అధికారం ముఖ్యం కాదని, వ్యవస్థ ధ్వంసం కావొద్దని సూచించారు. ప్రస్తుతం దేశంలో కుహనా దేశభక్తులు ప్రమాదకరంగా మారారని, అలాంటి శక్తులపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశంలో కులాలు, మతాల పేర, దేశభక్తి పేర విభజించు.. పాలించు అన్న పద్ధతిలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని మండిపడ్డారు.
దేశ సంపదను అప్పనంగా అంబానీ, అదానీలకు అప్పగిస్తున్నదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో నయాభారత్ నిర్మాణం కోసం అడుగులు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పిలుపునిచ్చారు. సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంవేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రజాగాయకురాలు విమలక్క, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రవీందర్రావు, రాజేశ్వర్రావు, బద్దం ఎల్లారెడ్డి కుటుంబసభ్యులు, సిద్ధం వేణు, జిందం కళాచక్రపాణి, మణికంఠరెడ్డి, నాగరాజు, సామల మల్లేశం, కడారి రాములు, పంతం రవి పాల్గొన్నారు.