భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ తీరుపై పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. ఆయన వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదమవుతుండగా, క్షేత్రస్థాయి నాయకుల నుంచి నియోజకవర్గ ఇన్చార్జిల దాకా పార్టీ కేడర్ భగ్గుమంటున్నది. పార్టీలో మొదటి నుంచీ పనిచేస్తున్న నాయలకులను నిర్లక్ష్యం చేస్తూ అవమానించడంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఇరవై రోజుల క్రితం ధర్మపురిలో ఏకంగా సీనియర్లు నిలదీయగా, ఆదివారం పెద్దపల్లిలో ప్రెస్మీట్ పెట్టి మరీ బహిరంగంగా ఘాటు విమర్శలు చేశారు. వివేక్ తీరుమార్చుకోకపోతే ఊరుకునేది లేదని, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి తరిమికొడుతామని, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాషాయ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుండగా, ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్మథనంలో పడిపోయారు.
కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పెద్దపల్లి (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 27, 28వ వార్డుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ ఆధ్వర్యంలో శనివారం పలువురు నాయకులు బీజేపీలో చేరారు. అయితే ఈ చేరికలు పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీ వెన్నంటి ఉన్న తమను నిర్లక్ష్యం చేస్తూ అవమానాలకు గురి చేస్తున్నాడంటూ పలువురు సీనియర్లు మండిపడుతున్నారు. ఆది నుంచీ పనిచేస్తున్న నాయకులను పక్కనపెట్టి, ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ భగ్గుమంటున్నారు.
ఆదివారం బీజేపీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పిన్నింటి రాజు, మండలాధ్యక్షుడు పర్శ సమ్మయ్య, బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్రెడ్డి, నాయకుడు కాసర్ల జనార్దన్రెడ్డి ఆదివారం పెద్దపల్లిలోని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నివాసంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి మరీ ఘాటుగా విమర్శించారు. వివేక్ ఒంటెత్తు పోకడ పోతున్నారని, పెద్దపల్లిలో పార్టీ కార్యక్రమాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్లను విస్మరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఊరుకునేది లేదని, తీరుమార్చుకోకపోతే పెద్దపల్లి నియోజకవర్గం నుంచి తరిమికొడుతామని హెచ్చరించారు. ద్వితీయ శ్రేణి కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేయాల్సిన ఆయనే తప్పులు చేసుకుంటూ వెళ్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. సీనియర్లను గౌరవించకుండా, పార్టీ నాయకులు, కార్యకర్తలను పిలవకుండా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వివేక్ బీజేపీలో చేరిన నాటి నుంచి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆ పార్టీలో సీనియర్లను కాదని కొత్త కొత్త వారిని ప్రొత్సహిస్తూ తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు.
ఆది నుంచీ అదే తీరు
వివేక్ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలోని సీనియర్లను, పార్టీ కోసం ముందు నుంచి పనిచేసిన వారిని పక్కన పెడుతారనే విమర్శలున్నాయి. గతంలో కాంగ్రెస్లో పనిచేసిన సమయంలో అదే తీరున వ్యవహరించడంతో ఆయన వ్యవహారశైలిపై ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు బాహాటంగానే వ్యతిరేకించారు. ఆ తదుపరి బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లో ఉన్నప్పుడు అదే విధానంతో ముందుకు సాగారు. తర్వా బీజేపీలోనూ ఆయన అదే పంథాను అనుసరిస్తున్నారు. గతంలోనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు మంచిర్యాలలో వివేక్కు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు.
ఆయన తీరు మార్చుకోవాలని గళం విప్పారు. ఇటీవల ప్రధాని సభ రామగుండంలో జరిగినప్పుడు ఆ సభకు వివేక్ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఈ సమయంలోనూ సీనియర్లను, పార్టీకి సేవ చేసిన వారికి కనీస సమాచారం ఇవ్వకపోవడం, సభకు పాస్లు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి అసెంబ్లీ నియోజవర్గ ఇన్చార్జి గుజ్జుల రామకృష్ణ రెడ్డి బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా విలేకరుల సమావేశం పెట్టి పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసిన వారిని వివేక్ లాంటి నాయకులు ఎలా అవమానిస్తున్నారో ఆయన వివరించారు.
ఇరువై రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ విధానంలో ధర్మపురిలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి బూత్ కమిటీ సభ్యుల సమావేశం వేదికగా పలువురు నాయకులు భగ్గుమన్నారు. సీనియర్లను చిన్నచూపు చూడడంపై వివేక్ను ఏకంగా నిలదీశారు. పాత వారిని పక్కనపెట్టి.. కొత్త వారు రాజ్యమేలుతున్నారని, పార్టీ నియమ నిబంధనలు, మూల సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారని దీనికి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. ఈ సమయంలో ఈ సమయంలో సర్దిచెప్పకుండా ‘ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో’ అంటూ వివేక్ మా ట్లాడిన తీరుతో మనోవేదనకు గురైన కన్నం అంజయ్య తన అనుచరులతో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో బీజేపీ నేతలు మరింత భగ్గుమంటున్నారు. తాజాగా పెద్దపల్లిలో బహిరంగంగా విమర్శలు చేయడం ఆయన తీరును బయటపెడతున్నది.
తరిమికొడుతాం
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ను పార్టీ అధిష్టానం పట్టించుకో వడం లేదు. 30 ఏండ్లుగా పార్టీలో పని చేస్తున్న మమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. కార్యక్రమాలకు పిలువకుండా అవమానాలకు గురి చేస్తున్నాడు. మూడు దశాబ్ధాలుగా మేం అందరినీ కలుపుకొని పోయి పని చేస్తుంటే, కొత్తగా చేరిన నాయకులు మమ్మల్ని వేరు చేసి చూస్తున్నారు. ఇలాంటి చర్యలను అడ్డుకుంటాం. వివేక్ను తరిమి కొడుతాం.
-పిన్నింటి రాజు, బీజేపీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి
అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం
పెద్దపల్లి పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ మండల అధ్యక్షుడు, పట్టణ శాఖ అధ్యక్షుడు ఎవరినీ పిలువకుండా కార్యక్రమాలను చేయడం సిగ్గు చేటు. ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సరికాదు. మమ్మల్ని అవమానించేలా ఉన్నది. జాతీయ పార్టీ సిద్ధాంతాలను మాలాంటి కార్యకర్తలకు, నాయకులకు చెప్పాల్సిన వ్యక్తి ఇలా తప్పు చేయడం ఎంత వరకు సమంజసం. మాకు చెప్పొద్దని, మమ్మల్ని పిలవద్దని హైకమాండ్ ఏమైనా చెప్పిందా? ఇది ఎంత వరకు సమంజసం. జరుగుతున్న విషయాలన్నింటిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం.
-కొంతం శ్రీనివాస్రెడ్డి, బీజేపీ పెద్దపల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు