రాజన్న సిరిసిల్ల, జూన్ 18(నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిరిసిల్లలో పర్యటించారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుతో కలిసి వచ్చిన ఆయన, పలువురు బాధితులను పరామర్శించి ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని భరోసానిస్తూ ముందుకు సాగారు. రెండ్రోజుల క్రితం పానీపూరి తిని అస్వస్థతకు గురై సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
వైద్య సహాయం కోసం తాను ఉన్నానని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఇంకేమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకరావాలన్నారు. అంతకుముందు స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు అశ్విన్రావు ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్రావు హాజరయ్యారు. అశ్విన్రావు ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ టీవీ నారాయణ తల్లి వెంకటలక్ష్మి ఇటీవల మృతిచెందగా వెళ్లి పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.