రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా పర్యటన అనంతరం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు రానుననారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. 2020-21 సంవత్సరానికి 561 మంది ఎస్సీ లబ్ధిదారులకు 24.50కోట్ల రాయితీ రుణాలను పంపిణీ చేస్తారు. లబ్ధిదారులకు జంబోచెక్ అందిస్తారు. సిరిసిల్ల అర్బన్ మండలంలోని పెద్దూరులో 516, రగుడులో 72 డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేస్తారు. మండెపల్లిలో 747 మంది లబ్ధిదారులకు 75గజాల చొప్పున గృహలక్ష్మి పథకం కింద ప్రొసీడింగ్స్ చేస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మంత్రి రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
561 మంది దళితులకు సబ్సిడీ రుణాలు
దళిత యువకులు, మహిళలు స్వయం ఉపాధిలో రాణించేందుకు రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తున్నది. కార్లు, జేసీబీలు, వివిధ పరికరాల కోసం లక్ష వరకు 80శాతం, 2లక్షలకు 70శాతం, 3లక్షల నుంచి ఆపై రుణాలకు 60శాతం సబ్సిడీ రాష్ట్ర సర్కారు ఇస్తున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో 2021-23 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని యువతీ యువకుల కోసం పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు మంజూరు చేసింది. మంగళవారం అమాత్యుడు రామన్న సిరిసిల్ల జిల్లాలోని 561 మంది దళితులకు 24.50కోట్ల మేర సబ్సిడీ రుణాలు అందజేయనున్నారు.