కరీంనగర్ సిగలో మరో మణిహారం చేరింది. నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మానేరు నదిపై 224 కోట్లతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం సాయంత్రం రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనుండగా, ఇది నగరానికి తలమానికంగా నిలువనున్నది. తీగల వంతెనతోపాటు స్మార్ట్సిటీ కింద నగరవాసులకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు సిద్ధమైన వివిధ పనులను అమాత్యుడు ప్రారంభించనుండగా, కరీంనగర్కు నయాలుక్ రానున్నది. మరో 17 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ పనులకు శంకుస్థాపన చేయనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలతో నింపగా, నగరం గులాబీమయంగా మారింది.
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 20 : కరీంనగరానికి పర్యాటక శోభ తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జి బుధవారం ప్రారంభం కానున్నది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 224 కోట్లు వెచ్చించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన డైనమిక్ లైట్స్, భారీ స్క్రీన్స్లతో కేబుల్ బ్రిడ్జి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 500 మీటర్ల పొడవుతో ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణంలో రెండు పైలాన్స్తో కేబుళ్లను అనుసంధానం చేశారు. కాగా, ఇప్పటికే వంతెనపై అన్ని పరీక్షలు పూర్తి చేయగా.. అప్రోచ్ రోడ్డు పనులు కూడా ఇటీవల పూర్తి చేశారు. బ్రిడ్జిపై నాలుగు వరుసల రోడ్డుతో పాటు ఇరువైపులా పాదచారుల కోసం ప్రత్యేకంగా ఫుట్పాత్లను ఏర్పాటు చేశారు. అలాగే, కమాన్ నుంచి బ్రిడ్జి వరకు మాస్టర్ ప్లాన్ మేరకు రోడ్డు విస్తరించి డివైడర్లను ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే, ఈ రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడిచేందుకు వీలుగా ఫుట్పాత్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే, ఈ రోడ్డులో హౌసింగ్బోర్డు చౌరస్తా, బ్రిడ్జి సమీపం, సదాశివపల్లి వద్ద ఐలాండ్స్ను సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఈ రోడ్డుకే సరికొత్త శోభ వచ్చింది. కమాన్ నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు, బ్రిడ్జి నుంచి సదాశివపల్లి మీదుగా మానకొండూర్ రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి కావడంతోపాటు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. బ్రిడ్జి ప్రారంభోత్సవం తర్వాత మానేరు రివర్ ఫ్రంట్లో రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాలను అనుమతించకుండా కేవలం నగరవాసులు సేదతీరేలా, కాసేపు సరదగా గడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
నగరపాలక సంస్థ పరిధిలో స్మార్ట్సిటీ కింద చేపట్టిన వివిధ సేవలు మంత్రి కేటీఆర్ ప్రారంభించిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా నగరంలో నిఘా మరింత పటిష్టం చేయడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పబ్లిక్కు ఎలాంటి సమయాల్లోనైనా సమాచారం అందించేలా అడ్రసింగ్ సిస్టం, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు చెప్పే విధంగా ఎన్విరాన్మెంట్ సెన్సార్లు, వై ఫై హాట్స్పాట్స్ను మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు ట్రయల్ రన్ కూడా చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ వీడియో వాల్, కంట్రోల్ రూంతోపాటు, నగరంలోని 14 చౌరస్తాల్లో ఆటోమెటెడ్ ట్రాఫిక్ సిగ్నిల్స్, 18 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, 8 ప్రాంతాల్లో విజువల్ డిస్ప్లేలు, 5 ప్రాంతాల్లో ఎన్విరాన్మెంట్ సెన్సార్స్, 18 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైఫై హాట్స్పాట్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద 5150 కమర్షియల్ షాపులకు ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్ఐడీలను ప్రారంభించనున్నారు. వీటితోపాటు 2 కోట్లతో చేపట్టిన పౌర సేవా కేంద్రం, 2 కోట్లతో చేపట్టిన నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్కు ప్రారంభోత్సవం చేయనున్నారు. వీటితోపాటు 10 కోట్ల వ్యయంతో కశ్మీర్గడ్డ రైతుబజార్ స్థలంలో చేపట్టనున్న సమీకృత మార్కెట్, 7 కోట్లతో చేపట్టనున్న స్మార్ట్ గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన కోసం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం ముస్తాబైంది. భవనాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా కార్యాలయంలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇతర కార్యక్రమాలకు ప్రారంభోత్సవం ఉండడంతో పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. పార్కింగ్ ప్రాంతమంతా పూర్తిగా సీసీ వేశారు. గార్డెనింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కార్యాలయంలోనూ క్లీనింగ్ పనులు చేస్తున్నారు. వివిధ పనులన్నింటినీ మంగళవారం సాయంత్రానికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.