మూడు నెలలు ఇష్టపడి చదవండి
జోనల్ వ్యవస్థతో స్థానికులకే ఉద్యోగాలు
‘కోటిన్నర ఎకరాల మాగాణి’గా తెలంగాణ
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్
మెట్పల్లిలో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవం
మెట్పల్లి, జూన్10 : ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వచ్చే అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మెట్పల్లి పట్టణంలోని వెంకట్రెడ్డి గార్డెన్స్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ కేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించుకున్నామని, అధికారంలోకి వచ్చాక నీళ్లు, నిధుల అంశంలో సంపూర్ణంగా న్యాయం జరిగిందని, అదే విధంగా ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
ఏ జిల్లాలో ఉన్న ఉద్యోగాలు ఆ జిల్లా వారికే దక్కేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లును పాస్ చేయించారని, గడిచిన ఎనిమిదేళ్లలో 1.32 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తున్నదని తెలిపారు. యువత సెల్ఫోన్లను మూడు నెలలు పక్కకు పెట్టి ఉద్యోగం సాధనే లక్ష్యంగా పట్టుదలతో చదవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా చదవడం, నైపుణ్యతను పెంచుకోవడం వల్ల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు గానీ, స్వయం ఉపాధి అవకాశాలు గానీ పొందవచ్చని చెప్పారు. ఉద్యోగం వద్దు తామే పది మందికి ఉపాధి కల్పిస్తామనుకునే వారిని ప్రభుత్వం టీ హబ్, టీస్కాబ్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా చేస్తుందన్నారు.
విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం
రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగా 7,300 కోట్ల వ్యయంతో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టి పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నట్లు తెలిపారు. ఉన్నత చదువుల కోసం ఏటా 18 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంటుకు వెచ్చిస్తున్నదని, విదేశాల్లో చదవడానికి వెళ్లే వారికి అంబేద్కర్, జ్యోతిబాఫూలే విద్యా పథకాల కింద ఒక్కో విద్యార్థికి 20 లక్షల చొప్పున అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. మొన్నటి వరకు ‘కోటి రతనాల వీణ.. నా తెలంగాణ’ అని అనేవారని, ఇప్పుడు ‘కోటిన్నర ఎకరాల మాగాణి తెలంగాణ’ అని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకం కింద కోటి ఇండ్లకు నీళ్లు, నాలుగేండ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని నిర్మించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
గూగుల్లో సెర్చ్ చేసినా ఇదే వస్తుందంటూ అక్కడున్న యువతతో సెల్ఫోన్లో గూగుల్లో ఓపెన్ చేయించి వారి నుంచి ప్రతిస్పందన రాబట్టారు. మారుతున్న కాలానికి అనుగణంగా యువత నైపుణ్యతను పెంచుకోవాలని, గల్ఫ్ దేశాలు వెళ్లి మన ప్రాంతానికి చెందిన ప్రవాసీయులు అక్కడ కార్మికులుగా అనేక కష్టాలు పడుతున్నారని, అక్కడికి వెళ్లే బదులుగా స్థానికంగానే లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని భార్యా పిల్లలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రవికి సూచించారు. మెట్లచిట్టాపూర్లో ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భువి, ధాత్రి బయో సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల రాష్ట్ర కమిషనర్ కృష్ణభాస్కర్ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, మెట్పల్లి, కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్లు రాణవేని సుజాత, లావణ్య, నాయకులు లోక బాపురెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, రాజేందర్, దారిశెట్టి రాజేశం, అన్నం అనిల్, జేడీ సుమన్, పూదరి సుధాకర్గౌడ్, మార్గం గంగాధర్, లింగంపల్లి సంజీవ్ పాల్గొన్నారు.
యువత సద్వినియోగం చేసుకోవాలి
గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రోత్సాహం అందిస్తున్నాం. పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో నా తనయుడు సంజయ్ ఉచితంగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాం. స్టడీ మెటీరియల్తో పాటు భోజనం కూడా ఉచితంగా అందిస్తాం. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.
– ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు