కోరుట్ల, ఏప్రిల్ 22 : యాసంగి పంట కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలని, వ్యవసాయాధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు సూచించారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గంలోని రైస్ మిల్లర్లు, వ్యవసాయాధికారులు, ప్రజా ప్రతినిధులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వరి పంట కొనుగోళ్ల విషయంలో రైస్మిల్లర్లు తాలు, తప్ప పేరిట రైతులను ఇబ్బందులు పెట్టవద్దన్నారు. ఐకేపీ కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలను అధికారులు తూచ తప్పకుండా రిజిస్ట్రర్లో నమోదు చేయాలని, ధాన్యం మిల్లు వద్దకు చేర్చేందుకు లారీ ఓనర్లు సహకరించాలన్నారు.
కొనుగోళ్ల విషయంలో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని, ఎఫ్సీఐ ద్వారా బియ్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నదని మండిపడ్డారు. రైతుల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కాగా, వ్యవసాయ అధికారులు తమ పరిధిలో కొనుగోళ్ల సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలని ఆర్డీవో వినోద్కుమార్ సూచించారు. ఇక్కడ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షుడు లోక బాపురెడ్డి, ఆర్బీఎస్ కన్వీనర్ చీటి వెంకటరావు, జడ్పీ సీఈవో రామానుజచారి, డీఆర్డీవో పీడీ లక్ష్మీనారాయణ, డీఎస్వో రజనీకాంత్, తహసీల్దార్ రాజేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నవీన్రావు, సహకార సంఘాల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వ్యవసాయ శాఖ ఉన్నారు.