మెట్పల్లి, జూన్ 15 : విద్యుత్ లైన్ల మరమ్మతుల సందర్భంగా చెట్లను నరికివేయకుండా సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యుత్ లైన్ల క్లియరెన్స్ పనుల్లో చెట్లను విచక్షణారహితంగా తొలగించడం, కొమ్మలు నరికివేడయం వల్ల పచ్చదనంపై తీవ్ర ప్రభావం పడుతున్నదని వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా కొనసాగించడం, చెట్ల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అవసరమైన చోట్ల చెట్లను పూర్తిగా తొలగించకుండా కొమ్మలను తొలగించాలని సూచించారు. పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన గాలి, జీవ వైవిధ్యం, భూ గర్భజలాల పరిరక్షణలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని, చెట్ల సంరక్షణతోపాటు విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సమతుల్యంగా కొనసాగాలని పేర్కొన్నారు. చెట్ల తొలగింపు పనులు చేపట్టే ముందు అటవీశాఖతో సమన్వయం చేసుకోవాలని, పచ్చదనాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.