మల్యాల, ఫిబ్రవరి 12 : యాదాద్రి తరహాలోనే భక్తులకు పలు సౌకర్యాలను కల్పించడంతో పాటూ మాస్టర్ప్లాన్ రూపకల్పన కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాము కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చినట్లు సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆర్కిటెక్చర్ ఆనంద్సాయి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి చేరుకున్న ఆయన ప్రధాన ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటూ ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనంద్సాయి మాట్లాడుతూ ఆగమశాస్త్రం ప్రకారం మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామని, రాబోయే 3, 4 రోజుల్లో సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయానికి వస్థున్న సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత పలు మార్పులు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఆలయంలో రూపొందించిన సర్వేరిపోర్టులను పరిశీలించడంతోపాటూ మొదటి ప్రాకారం, రెండో ప్రాకార మండపం, పుష్కరిణి ఉండేలా పలు చర్యలు తీసుకుంటామన్నారు. కొండపైన 108 అడుగుల ఆంజనేయస్వామి వి గ్రహాన్ని పెట్టాలని భావిస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యం కోసం దశల వారీగా ప్రణాళికలు రూ పొందిస్తూ మాస్టర్ ప్లాన్కు యాక్షన్ప్లాన్ నిర్వహిస్తామన్నారు. తనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి యాదగిరి గుట్ట ఆలయ ప్రాజెక్ట్ తర్వాత రెండోది కొండగట్టు ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ రూపకల్పన అని వివరించారు. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్తో పలుమార్లు కొండగట్టు ఆలయ అభివృధ్ధిపై చర్చలు నిర్వహించామని, ప్రభుత్వపరంగా రూ. 100 కోట్ల మంజూరుతో క్షేత్రస్థాయిలో పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో టంకశాల వెంకటేశం, చైర్మన్ తిరుక్కోవెళూర్ మారుతీస్వామీ, ఆలయ స్థానాచార్యులు కఫీంధర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, వకుళాభరణం రఘు, ఉప ప్ర ధాన అర్చకులు చిరంజీవస్వామి పాల్గొన్నారు.
కొండగట్టు అంజన్న ఆలయ ఆవరణ విస్తృత అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ. 100 కోట్లు మంజూరు చేయగా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా సూచించారు. కొండగట్టు అంజన్న ఆలయ ఆవరణలోని ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఎగ్గడి భాస్కర్, ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్సాయితో కలిసి పలుశాఖల అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ప్రధానంగా ఆలయ పరిసరాలలో శానిటేషన్ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడుతూ, అమలు చేయాలని సూచించారు. మౌలిక వసతులైన నీరు, విద్యుత్, శానిటేషన్, వసతి సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. కొండగట్టు ఆలయ పరిధిలో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం అవసరమైన ఉద్యోగాల వివరాలతో పాటూ, కొండగట్టులో చేపట్టాల్సిన పనులను ముందుగానే గుర్తించి నివేదిక రూపంలో తమకు అందజేయాలని ఆలయ ఈవో టంకశాల వెంకటేశంను ఆదేశించారు. ఆనంద్సాయి కొండగట్టుకు వచ్చినందున ప్రణాళికలు రూపొందిస్తారని, దానికి తగ్గట్టుగా యాక్షన్ప్లాన్ను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మాధురి, జగిత్యాల డీఎస్పీ ప్రకాష్, ఆలయ చైర్మన్ మారుతీస్వామీ, జడ్పీటీసీలు రామ్మోహన్రావు, పునుగోటి ప్రశాంతి, స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, వివిథ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.