కరీంనగర్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ కొమురవెల్లి మల్లన్న స్వరూపమని, గొల్ల, కుర్మలను ఆదుకునేందుకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లిలోని మల్లన్నను దర్శించుకున్న వినోద్కుమార్ ప్రజ్ఞాపూర్లో కరీంనగర్ జిల్లాకు చెందిన యాదవ ప్రజా ప్రతినిధులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గొల్ల, కుర్మల ఆరాధ్యదైవం కొమురవెల్లి మల్లన్న అని అన్నారు. వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో రూ. 11 వేల కోట్ల వ్యయంతో 75 శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొమురవెల్లి మల్లన్న ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. యాదవులు నీతి నిజాయితీకి మారుపేరని సీఎం కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో అనేక సార్లు ప్రస్తావించిన విషయాన్ని వినోద్కుమార్ గుర్తు చేశారు.
ప్రజల బాగోగులు పట్టించుకునే, అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. మాయ మాటలు చెప్పేవారిని కాకుండా, చేతల ప్రభుత్వానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్కే పరిమితమైన సదర్ను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ సర్కారు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. యాదవ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మేళనంలో నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్తోపాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కరీంనగర్ జిల్లా యాదవ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.