జగిత్యాలటౌన్, నవంబరు17: రైతు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ కృషితో సాగు పండుగలా మారిందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ పేర్కొన్నారు. పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కిసాన్ మేళా, శాస్త్రవేత్తల -రైతుల చర్చాగోష్ఠిలో పాల్గొని, ఆయన మాట్లాడారు. మన దేశం వ్యవసాయాధారిత ప్రాంతం కావడంతో సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి 5 వేల ఎకరాలకు ఒక రైతు వేదికను నిర్మించారని, రైతులు సద్వినియోగం చేసుకొని శాస్త్రవేత్తలతో తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు జగిత్యాల జిల్లాలో గరిష్ఠంగా 3 లక్షల ఎకరాలు దాటి ఎన్నడూ పంటలు పండలేదన్నారు. రాష్ట్రంలో మిషన్కాకతీయ ద్వారా చెరువుల పూడికలు తీసి నీటిని నింపడంతో ప్రస్తుతం 4లక్షల 40 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని చెప్పారు. మన రాష్ర్టాల్లో రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తప్పుగా మాట్లాడిన వారిని రైతులు, రైతు నాయకులు నిలదీయాలన్నారు. 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, బీమా వంటి పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు.
సారంగాపూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టుకు మొత్తం రూ.135 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం ఇప్పటివరకు రూ.90 కోట్లు విడుదల చేసిందన్నారు. విమర్శలు చేసే వారు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు పొలాస ప్రాంతీయ వ్యవసాయ కళాశాలకు రూ.20 కోట్లు విడుదల చేసిందని వివరించారు. ఈసదస్సును జగిత్యాలజిల్లాలో ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ జగదీశ్వర్ మాట్లాడుతూ, ఈ సదస్సులో రైతులు లేవనెత్తిన సందేహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, సాగులో ఎదురవుతున్న సవాళ్లను శాస్త్రవేత్తల పరిశోధనా అంశాలుగా తీసుకొని ముందుకు సాగుతామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్ కలిసి శాస్త్రవేత్తలు తయారు చేసిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ప్రజాప్రతినిధులు, రైతులు, శాస్త్రవేత్తలు పరిశోధనా స్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవ్తేతలు సాగులో మెళకువలు, ఎరువుల, పురుగు మందుల వాడకంపై రైతులకు వివరించారు. ఇక్కడ విస్తరణ సంచాలకులు సుధారాణి, పొలాస పరిశోధనా స్థానం సహ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్, వ్యవసాయ కళాశాల డీన్, నరేందర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ చీటి వెంకటరావు, వ్యవసాయ, ఉదాన్య శాఖల అధికారులు సురేశ్ కుమార్, ప్రతాప్సింగ్, నాబార్డు డీడీఎం మనోహర్రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ నక్కల రాధ, పొలాస సర్పంచ్ గాజంగి భారతి ఉన్నారు.
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అనేక పథకాల అమలు, సౌకర్యాల కల్పనతో సాగు బంగారమైంది. యువత ఉద్యోగాలు మాని సాగు వైపు మొగ్గు చూపుతున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం రైతులను అణగదొక్కుతున్నది. గత యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో ధర్నాలు చేసినా స్పందించకుండా నిండా ముంచింది. ఎల్ఐసీ లాంటి సంస్థలను, బొగ్గును సైతం ప్రైవేటీకరించాలని చూస్తున్నది. ధాన్యం నాణ్యతా ప్రమాణాల విషయంలో కొనుగోలుదారులు పెడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర అభివృద్ధిలో మనమందరం భాగస్వాములం కావాలి.
– కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. అనేక పథకాలతో అండగా నిలుస్తున్నారు. గతంలో రాత్రి కరెంటు పోతే పొలాల్లో కాపలా కాసి కరెంటు వచ్చిన తర్వాత నీరు పెట్టేవాళ్లు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్, అధునాతన యంత్రాల వినియోగంతో సాగు సులువుగా మారింది. పొలాస శాస్త్రవేత్తలు రైతు సమస్యలను పరిష్కరించడంతో పాటు నూతన వంగడాలను అందించడంలో ముందున్నారు.
– దావ వసంత, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్