కోరుట్ల, ఆగస్టు 23: ‘నాన్న అడుగుజాడల్లో నడుస్తా. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తానని’ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తనయుడు బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మొదటిసారిగా కోరుట్లకు వచ్చిన సందర్భంగా ఆయన నియోజకవర్గంలో నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కోరుట్ల పట్టణంలోని కావేరి గార్డెన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరై మాట్లాడారు. తన 19 ఏళ్ల వయసులోనే రాజకీయ ప్రస్తానం మొదలైందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు, ప్రేమ ఆప్యాయతలు నన్ను రాజకీయ రంగం వైపు మళ్లించాయన్నారు. స్వచ్ఛందంగా ఇంతమంది ప్రజలు సభకు రావడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. మీకు సేవచేయడంలోనే అసలైన కిక్కు ఉందని చెప్పారు. ‘మానాన్న మాకు సంస్కారం నేర్పారని, నేను ముక్కు సూటి మనిషినని, ఏది మనుసులో పెట్టుకోకుండా మాట్లాడుతానని’ పేర్కొన్నారు. తాను నిరాడంబరంగా జీవించడానికి మొగ్గు చూపుతానని, తనను మీలో ఒకడిగా కుటుంబ సభ్యుడిగా చూసుకోవాలన్నారు. 15 ఏళ్లు మా నాన్న ఎమ్మెల్యేగా పని చేసినా ఎప్పుడూ రాజకీయంగా జోక్యం చేసుకోలేదని, ఎలాంటి పైరవీలు చేయలేదన్నారు. నియోజకవర్గ ప్రజలకు చెడ్డపేరు తెచ్చే పని చేయనని, మీ ఆశీర్వాదంతో మీలో ఒకడిగా మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో సీటు కేటాయించడంపై సీఎంకు సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బాగుండాలంటే సీఎం కేసీఆర్నే ప్రజలు మళ్లీ గెలిపించుకోవాలని సూచించారు. ఇక్కడ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, మున్సిపల్ అధ్యక్షురాలు అన్నం లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, సర్పంచ్ల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, ఎంపీపీ తోట నారాయణ, వైస్ ఎంపీపీ చీటి స్వరూప, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, పట్టణ మహిళ అధ్యక్షురాలు గంటేడి నందిత పాల్గొన్నారు.
ఎక్కడికి వెళ్లను.. మీతోనే ఉంటా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
‘కోరుట్ల నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్లు. నా జీవితం మీకే అంకితం. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వదిలివెళ్లను. చావైనా బతుకైనా మీతోనే’ అని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు భరోసా ఇచ్చారు. ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరై, ఉద్వేగభరితంగా ప్రసగించారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంతో నిరంతరం తన వెన్నంటి నిలిచి ప్రోత్సాహం అందించిన తన కొడుకు సంజయ్ని ప్రజలు అక్కున చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2014 ఎన్నికల నుంచి తన గెలుపు లక్ష్యంగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై ప్రజా సేవలో ఉన్నాడని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు నిస్వార్థ సేవలు అందించాడన్నారు. ఐటీ విద్యార్థులకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఉచితంగా కోచింగ్ అందించడమే కాకుండా వారికి వసతి కల్పించి చేదోడువాదోడుగా నిలిచాడని కొనియాడారు. యశోద దవాఖానలో స్పైన్ డాక్టర్గా సేవలందిస్తూ నియోజకవర్గ ప్రజలకు వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల్లో బిల్లులు తక్కువ చేయించి డిస్కౌంట్ డాక్టర్గా పేరు గడించారని గుర్తు చేశారు. సంజయ్కు అన్ని వేళాల్లో అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తగా సాయం అందించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటానని, ప్రజలు తన కుమారుడిని భారీ మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంతమంది వ్యక్తులు జాతరలో గుడారాలు వేసుకునే సంచార దుకాణదారులుగా వచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని, నమ్మవద్దన్నారు. తెలంగాణలో ప్రజా సంక్షేమాన్ని చూసి కన్నుకుట్టిన ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండి పడ్డారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలను వారి పాలిత రాష్ర్టాల్లో అమలు చేయించాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.