కరీంనగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): సహకార రంగానికి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రోల్ మోడల్గా నిలుస్తోందని మహబూబ్నగర్ డీసీసీబీ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. బుధవారం ఆ జిల్లాకు చెందిన డీసీసీబీ ప్రతినిధులు, సహకార సంఘాల అధ్యక్షులు కరీంనగర్లోని కేడీసీసీబీ ప్రధాన కార్యాలయం, చొప్పదండి సింగిల్ విండోను సందర్శించారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ డీసీసీబీ అధ్యక్షుడు చిట్యాల నిజాంపాషా మాట్లాడుతూ, కేడీసీసీబీ టీమ్ వర్క్తో సహకార బ్యాంకింగ్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. చైర్మన్ కొండూరి రవీందర్రావు ఆధ్వర్యంలో కరీంనగర్ డీసీసీబీ సమష్టి కృషితో విజయవంతంగా ముందుకు సాగుతూ దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించిందని కొనియాడారు. కొండూరి సేవలు అనిర్వచనీయమన్నారు. ఈ స్ఫూర్తి తమకు విజయ మార్గాన్ని చూపిందన్నారు. ఇక్కడి ఫార్ములాను అనుకరించి ఉద్యోగులు, ఎన్నికైన ప్రజాప్రతినిధుల మద్దతుతో తమ బ్యాంకును లాభాల బాటలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సహకారంతో పారదర్శకత, సుపరిపాలనతో కేసీసీబీ మంచి లాభాలను ఆర్జించిందన్నారు. 98 శాతం రికవరీ రేటు సాధించిన ఉద్యోగులను ఆయన అభినందించారు. వాణిజ్య బ్యాంకులతో సమానంగా కార్యకలాపాలను వైవిధ్యపర్చడం, అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తేవడం ద్వారా సహకార బ్యాంకులు లాభాలు ఆర్జిస్తాయని ఈ అధ్యయనంలో తాము తెలుసుకున్నామని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ, 2005లో రూ.57 కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయి ప్రస్తుతం లాభాలు ఆర్జిస్తూ రూ. 5 వేల కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్న కరీంనగర్ డీసీసీబీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పీఏసీఎస్ల పనితీరును తాము కూడా అనుకరిస్తామని, ఈ బ్యాంకుతో సమానంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తామని, వివిధ వ్యాపారాల్లోకి ప్రవేశించి వైవిధ్యం చూపుతామని చెప్పారు.
ఈ సందర్భంగా కేడీసీసీబీ ప్రధాన కార్యాలయంతోపాటు చొప్పదండి సింగిల్ విండోను సందర్శించిన ఈ ప్రతినిధుల బృందం ఇక్కడ అందిస్తున్న సహకార సేవలను పరిశీలించింది. వివిధ విభాగాల్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కేడీసీసీబీ సీఈవో ఎన్ సత్యనారాయణరావు, బ్యాంకు, పీఏసీఏసీల పనితీరును ఈ సందర్భంగా వారికి వివరించారు. పీఏసీఎస్లను కంప్యూటరీకరించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని, పారదర్శకత, జవాబుదారీతనం కోసం పీఏసీఎస్ల అంతర్గత ఆడిట్, తనిఖీల ద్వారా అక్రమాలు, అవకతవకలను నివారించగలిగామని చెప్పారు. బ్యాంకు వాటర్ షెడ్లు, యూపీఎన్ఆర్ఎం పథకాలను చేపట్టి దేశంలోనే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. డీసీసీబీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, సీఏసీఎస్ అభివృద్ధి కేంద్రం రిసోర్స్ పర్సన్ జీ సత్యనారాయణ తదితరులు ఈ బృందం వెంట ఉన్నారు.