కరీంనగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : జగిత్యాలలో ఈనెల 20న నిర్వహించే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించాలని నిర్దేశం చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ముఖ్యనాయకులతో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏ నియోజకవర్గం నుంచి ఎంత మందిని తరలించాలనే దానిపై ఆయన ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలకు బాధ్యతలు అప్పగించారు. జన సమీకరణపై పలు సూచనలు చేశారు. మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో నిర్వహించే భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతున్నారని చెప్పారు. జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని, కరీంనగర్ నియోజకవర్గం నుంచి 5 వేల మందిని, ఉమ్మడి జిల్లా పరిధిలోని మిగతా ఒక్కో నియోజకవర్గం నుంచి 3 వేల మందిని తరలించాలన్నారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఒడితల సతీశ్కుమార్, పుట్ట మధూకర్, సుంకె రవిశంకర్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Karimnagar4