కోరుట్ల, సెప్టెంబర్ 3 : ఇంటింటికీ ఆసరా అవుతూ సబ్బండ వర్గాలకు ప్రగతి ఫలాలు అందిస్తూ సీఎం కేసీఆర్ పేదల ఆత్మబంధువుగా నిలిచారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. అడగకముందే వరాలిచ్చే దేవుడు అని కొనియాడారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 1515 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఏడుగురికి కల్యాణలక్ష్మి, నాలుగు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పింఛన్ రూ.600 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. బీజేపీ నాయకులు వలసదారుల్లా ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తూ ప్రజలను మాయమాటలతో మభ్య పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నాయకులకు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని, కరోనా కష్టకాలంలో వీరంతా ఎటు పోయారని ప్రశ్నించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఢిల్లీ పాలకుల చేతిలో పెట్టి ఆగం కావద్దని సూచించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం ఉండదని, వాటిని ఎత్తి వేసి గోస పెడుతారని జోస్యం చెప్పారు. ప్రజలు సంతోషంగా ఉండడం ఇష్టంలేని బీజేపీ పెద్దలు పచ్చని రాష్ర్టాల్లో చిచ్చు పెట్టి చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన పడగొట్టి గద్దెనెక్కేందుకు పావులు కదుపుతున్నారని దుయ్యబట్టారు. దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టిన బీజేపీ నాయకులు, అన్ని రాష్ర్టాల్లో అధికారంలోకి రావాలనే దురాశతో మత కల్లోలాలు సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని, ఈ నెల 5న కోరుట్లలో వార్డుల వారీగా ఏర్పాటు చేసే సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, కౌన్సిలర్లు సంగ మాలతి, రేష్మా, పోగుల ఉమారాణి, గంధం గంగాధర్, మోర్తాడు లక్ష్మీనారాయణ, జిందం లక్ష్మీనారాయణ, మహ్మద్ సాబీర్ అలీ, సజ్జు పాల్గొన్నారు.