కరీంనగర్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించాలనే దురుద్దేశంతో బీజేపీ తెచ్చిన మునుగోడు ఎన్నికలో ప్రజలు ఆ పార్టీ కుట్రలను తిప్పి కొట్టి బొందపెట్టారని చెప్పారు. అప్రజాస్వామ్యంపై ధర్మాన్ని గెలిపించారని, ఈ విజయం బీఆర్ఎస్కు తొలిమెట్టని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భవిష్యత్తులోనూ ఇవే ఫలితాలు వెల్లడవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మునుగోడులో బీజేపీకి వచ్చిన ఓట్లు ఆ పార్టీకి వచ్చినవి కాదని, కేవలం అభ్యర్థికి వేశారని, అసలు బీజేపీకి బలం కాదు కదా అసలు క్యాడరే లేదని ఎద్దేవా చేశారు.
సీఎం వెంటే ప్రజలు
మునుగోడు విజయంతో ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారనే విషయం స్పష్టమైంది. రాష్ట్రంలో అస్థిరతను సృష్టించి, ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిన బీజేపీ కుట్రలను ఛేదిస్తూ వారికి ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చారు. కేంద్రంతో పాటు, దేశంలోని అన్ని రాష్ర్టాల్లో తమ పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలని, ఇతర ఏ పార్టీలు బతికి ఉండవద్దనే దురేద్దశంతో ప్రజాస్వామ్య వ్యవస్థను ఎగతాళి చేసేలా బీజేపీ నాయకులు వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేలా పరిపాలన సాగిస్తున్నారు. ప్రజాభిప్రాయం అనుకూలంగా లేకపోయినా, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, పలు రాష్ర్టాల్లో కుట్రలతో ప్రభుత్వాలను పడగొడుతూ వస్తున్నారు. తెలంగాణలో సైతం అలాగే చేయాలన్న కుట్రలో భాగంగా ఈ ఎన్నికకు తెరలేపింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత డబ్బు పంచినా ఇక్కడ ప్రజాస్వామ్యమే గెలిచింది. నేను సంస్థాన్ నారాయణపూర్లోని పుట్టపాకలో ప్రచారం నిర్వహించా. ఇక్కడ టీఆర్ఎస్కు దాదాపు 350 ఓట్ల మెజార్టీ వచ్చింది. గ్రామస్తులకు ధన్యవాదాలు.
– కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
ప్రజాస్వామ్యాన్ని బతికించిన ఎన్నిక
ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించిన ఎన్నిక. వందల కోట్లు పంచి అడ్డదారిలో గెలవాలని చూసిన బీజేపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పిన మునుగోడు ప్రజలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పట్టంగట్టారు. అన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినా, కుట్రలు, కుతంత్రాలు చేసి గెలవాలని ప్రయత్నించినా బీజేపీ నాయకులను ప్రజలు తిరస్కరించారు. ధన, మద బలం చూపి మునుగోడు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినా బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని మునుగోడు ఉపఎన్నిక ద్వారా అక్కడి ప్రజలు నిరూపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై ప్రత్యక్ష దాడులకు దిగి తామే మొనగాళ్లమని విర్రవీగిన బీజేపీ నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా మునుగోడు ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు ఇది. బీఆర్ఎస్ రూపంలో కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడి పథకాలన్నీ భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా అమలు చేస్తాం.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
రాష్ట్రంలో మరో పార్టీకి స్థానం లేదు
తెలంగాణలో టీఆర్ఎస్కు తప్ప మరో పార్టీకి స్థానం లేదు. అదే మునుగోడు ప్రజలు మరోసారి నిరూపించారు. బీజేపీకి, కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పారు. టీఆర్ఎస్కే ప ట్టంగట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలోని సబ్బండ వర్ణాల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైంది. యావ త్ ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని నిరూపితమైంది.
–పుట్ట మధూకర్, పెద్దపల్లి జడ్పీచైర్మన్
అప్రజాస్వామ్యంపై ధర్మం గెలిచింది..
ప్రధాని నరేంద్ర మోదీ అప్రజాస్వామిక విధానాలపై మునుగోడు ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మమే గెలిచింది. రాష్ట్రంలో కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పగించి కాంట్రాక్టర్లతో కోట్ల రూపాయలను కుమ్మరించినా మునుగోడు బిడ్డలు బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టారు. బీజేపీ అసత్యప్రచారాలు, మోసపూరిత విధానాలకు తగిన గుణపాఠం చెప్పారు. కోట్ల రూపాయల డబ్బుసంచులతో అడ్డంగా దొరికిపోయిన బీజేపీకి ఇది చెంప పెట్టు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి బహుమానంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మునుగోడు ప్రజలు గెలిపించారు. ప్రజా స్వామ్యాన్ని రాజ్యాంగ విలువలను కాపడటంలో కేసీఆర్కు, టీఆర్ఎస్కు అండగా నిలిచిన మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనాలు.
– డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేతకాని, పెద్దపల్లి ఎంపీ
బీజేపీ కుట్రలను తిప్పికొట్టారు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీ కుట్రలను తిప్పికొట్టారు. ఇది టీఆర్ఎస్ విజయం. ప్రజలు టీఆర్ఎస్ పట్ల మరోసారి సంతృప్తిని తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ప్రజలు ఓ కానుగా ఇచ్చారు. ఈ గెలుపుతో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా వెళ్లడానికి లైన్ క్లియర్ అయ్యింది. బీఆర్ఎస్ తొలి విజయంగా నమోదైంది.
– టీ. భానుప్రసాదరావు, ఎమ్మెల్సీ
కేసీఆర్ నాయకత్వాన్నే విశ్వసిస్తున్నరు
వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ లాంటిది మునుగోడు ఫలితం. తెలంగాణలో టీఆర్ఎస్కే భవిష్యత్తు ఉంటుందని ఈ ఎన్నిక నిరూపించింది. భవిష్యత్తులో వచ్చే ప్రతి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కే పట్టంగడతారనే నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రతి పేదింటికీ, అర్హులైన కుటుంబాలకు అందుతున్నాయి. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఆయనతోనే తమకు భవిష్యత్తు ఉందని నమ్ముతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. నిజానికి బీజేపీకి తెలంగాణలో అంతగా బలం లేదు. ఆ పార్టీ నాయకులు వాపును చూసుకుని బలుపని మురుస్తున్నరు. కేంద్రం నుంచి ఒక్కపైసా తేలేని బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదు.
– వొడితల సతీశ్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే
భవిష్యత్లోనూ ఇవే ఫలితాలు
మునుగోడు ఉప ఎన్నిక గెలుపు ప్రజా విజయం. కేసీఆర్పై ప్రజల్లో ఉన్న విశ్వాసం ప్రభాకర్రెడ్డిని గెలిపించింది. ప్రజలు బీఆర్ఎస్ను తమ సొంత పార్టీగా భావించి ఘనమైన విజయాన్ని అందించారు. బీజేపీ ఎన్ని అబద్దాలాడినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు కేసీఆర్ వెంటే నిలబడ్డారు. తెలంగాణ ప్రజల మాదిరిగానే దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోంది. భవిష్యత్తులోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి. అసత్యాలతో ప్రజలను మోసం చేయాలని చూసిన పార్టీలకు, నాయకులకు ఈ ఎన్నిక చెంపపెట్టు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని చెప్పడానికి ఈ ఎన్నిక రుజువుగా నిలిచింది.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే
ఇది ప్రజా విజయం
ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. టీఆర్ఎస్ అభ్యర్థికే పట్టంగట్టారు. తాము ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా ఉన్నామని మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించి నిరూపించారు. ఇది పూర్తిగా ప్రజల విజయం. గతంలో రాజగోపాల్రెడ్డిని గెలిపించి మోసపోయామని గ్రహించి ఇప్పుడు అభివృద్ధి కోసం టీఆర్ఎస్కు పట్టం గట్టారు.
–పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి.
కేసీఆర్ పాలనా దక్షతతోనే విజయం
సీఎం కేసీఆర్ దీక్ష, దక్షత, పాలన గొప్పతనం వల్లే మునుగోడులో ఘన విజయం సాధ్యమైంది. మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆర్థిక, అంగబలం ఉన్న నాయకుడు. ఒకసారి ఎంపీగా, మరోసారి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి. మూడు దశాబ్దాలుగా నల్గొండ జిల్లాలో రాజకీయంగా పేరెన్నికగన్న కుటుంబం. అయినా, అతనిపై టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈ రోజు వచ్చిన విజయానికి కారణమయ్యాయి. ప్రజలు టీఆర్ఎస్ వెంట, కేసీఆర్తో కలిసి సాగేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయం స్పష్టమైంది. బీజేపీ, కోమటిరెడ్డి కుటుంబం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం సీఎం కేసీఆర్కు తమ మద్దతును ప్రకటించారు. ఈ గెలుపు టీఆర్ఎస్ పటిష్టతకు, ప్రజాభిమానానికి నిదర్శనం.
–జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్
టీఆర్ఎస్ బలానికి నిదర్శనం
రాష్ట్రంలో టీఆర్ఎస్ బలాన్ని బీజేపీ చాలా తక్కువగా అంచనా వేసింది. కోట్ల రూపాయలతో ప్రజల ఓట్లను కొనవచ్చనే కుట్రలకు దిగింది. కానీ, మునుగోడు ప్రజలు గొప్ప తీర్పును ఇచ్చారు. ఇది టీఆర్ఎస్ బలానికి నిదర్శనం. కాంగ్రెస్ సీటును మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్కు బోనస్గా ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికే మునుగోడు ప్రజలు పట్టంగట్టారు.
–కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే,
టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు