రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ కప్ క్రికెట్ మానియా కొనసాగుతున్నది. మండుటెండల్లోనూ ఫుల్ జోష్ కనిపిస్తున్నది. యువతను క్రీడల్లో భాగస్వామ్యం చేయాలన్న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ఈ నెల 10న మొదలైన క్రికెట్ పోటీలు.. పదిహేను రోజులుగా మండల, పట్టణ స్థాయిలో హోరాహోరీగా సాగాయి. జిల్లాస్థాయిలో వారం పాటు సాగగా.. శుక్రవారం సెమీఫైనల్స్ ముగిశాయి. శనివారం ఫైనల్ మ్యాచ్ జరగనుండగా, అందుకు సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఫైనల్ మ్యాచ్ మొదలు కానుండగా, తిలకించేందుకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు.
అనంతరం జిల్లా స్థాయి విజేత జట్టుకు చాంపియన్ ట్రోఫీతోపాటు రూ.2లక్షల నగదు, సత్తచాటిన క్రీడాకారులకు వ్యక్తిగత మెడల్స్, రన్నరప్ జట్టుకు రూ.లక్ష నగదు, సెమీఫైనల్ ఓడిన నాలుగు జట్లకు సైతం రూ.50వేల చొప్పున నగదు, షీల్డ్లు, పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు క్రికెట్ కిట్లు అందించనున్నారు. ఆ తర్వాత తంగళ్లపల్లి మండలం రామన్నపల్లెలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తంగళ్లపల్లిలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణోత్సవానికి హాజరు కానున్నారు.