కమాన్పూర్, ఆగస్టు 28: చిన్ననాటి నుంచి పరుగుపై ఉన్న ఆసక్తిని సాధనగా మార్చుకున్న కమాన్పూర్ యువతి నల్లవెల్లి ఆనంది రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది. హనుమకొండలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ మీట్ సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన చేసి బంగారు పతకాలు సాధించింది. దీంతో సెప్టెంబరులో పుదుచ్చేరిలో జరిగే సౌత్ జోన్ నేషనల్ మీట్కు ఎంపికైంది.
హనుమకొండలోని జేఎన్ఎం స్టేడియంలో నిర్వహించిన 12వ తెలంగాణ స్టేట్ మీట్ సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అండర్-18 విభాగంలో ఆనంది పాల్గొంది. 200, 400 మీటర్ల పరుగు పందెం పోటీల్లో ప్రత్యర్థులను అధిగమించి అద్భుత ప్రతిభ కనబరిచింది. రెండు విభాగాల్లోనూ గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయిలో తన సత్తాను చాటింది.
రాష్ట్రస్థాయి పోటీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఆనంది సెప్టెంబరులో పుదుచ్చేరిలో నిర్వహించనున్న సౌత్ జోన్ నేషనల్ మీట్కు ఎంపికైంది. దీంతో జాతీయస్థాయిలోనూ తన ప్రతిభను నిరూపించుకునేందుకు ఆమెకు అవకాశం లభించింది. ఆనంది సాధించిన విజయంపై తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి, కోచ్ సుబ్బారావు అభినందనలు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లోనూ ఇదే ఉత్సాహంతో రాణించి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి శంకర్–భారతి దంపతుల రెండో కుమార్తె ఆనంది. ప్రస్తుతం గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు అథ్లెటిక్స్లో సాధన చేస్తూ రాష్ట్రస్థాయికి ఎదిగిన ఆనంది.. ఇప్పుడు జాతీయస్థాయిలో మెరుగైన ప్రదర్శనపై దృష్టి సారిస్తోంది.