కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 5 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తమిళనాడుకు అక్రమంగా బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా నిరాధారమని కరీంనగర్ రైస్మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బోయినపల్లి నర్సింగరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదని చెప్పారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలకు ఓడిగట్టి.. మిల్లర్లను అబాసుపాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మిల్లర్ల కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో పలువురు మిల్లర్ల యజమానులతో కలసి ఆయన మాట్లాడారు. మిల్లర్లు సొంతంగా కొనుగోలు చేసిన ధాన్యం ద్వారా తీసిన బియ్యాన్ని మాత్రమే తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.
అయితే కొంతమంది ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చిన కస్టం మిల్లెడ్ రైస్ (సీఎంఆర్) ధాన్యాన్ని పట్టి.. తమిళనాడుకు ఎగుమతి చేస్తూ.. అక్రమాలకు పాల్పడుతున్నామంటూ పలువురు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరి మాటలు నమ్మి పలు పత్రికలు ఇదే వార్తలు రాస్తున్నాయని, తద్వారా మిల్లర్ల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన చెందారు. కస్టం మిల్లెడ్ రైస్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్లు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, కావాలని తమపై అభాండాలు వేయడం మంచి పద్ధతికాదన్నారు. కేంద, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను తాము ఉల్లంఘించడం లేదని, చట్టానికి లోబడి మాత్రమే మిల్లుల నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా తమిళనాడుకు ఇటీవల చేస్తున్న ఎగుమతులన్నీ తాము కొనుగోలు చేసిన ధాన్యం నుంచి తీసిన బియ్యం మాత్రమేనని, అది కూడా 20శాతం తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. మిల్లులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కార్మికులు, రవాణా రంగం ఆధారపడి ఉందని, అన్సీజన్లో వారికి జీవనోపాధి కల్పించే క్రమంలో తాము కొనుగోలు చేసిన ధాన్యం మరాడిస్తూ, విక్రయించామన్నారు.
నిజానికి పదేళ్లుగా ఎక్స్పోర్టులు లేవని, ఇటీవలే పలు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నామని, ఎక్కడా నిబంధలు ఉల్లంఘించడం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి ఖరీఫ్ సీజన్లో 50శాతం, రబీ సీజన్లో 11శాతం మాత్రమే కష్టం మిల్లెడ్ రైస్ ప్రభుత్వానికి అప్పగించగా, మిగతా ధాన్యం మిల్లుల్లో గుట్టలకు గుట్టలుగా పేరుకుపోయినట్లు తెలిపారు. దీనికితోడు తాము కొనుగోలు చేసిన ధాన్యం కూడా నిల్వ ఉంచడంతో, వర్షాకాలంలో వచ్చే ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లభించడం గగనమవుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా 4.5 లక్షల నుంచి 5 లక్షల హెక్టార్ల వరకు వరి సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారని, గతేడాది కన్నా ఈ సారి అధిక దిగుబడి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, ఈ సమస్యను అధిగమించడంతోపాటు కూలీలకు ఉపాధి కల్పించేందుకే మిల్లర్లు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే తాము స్వయంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఖాళీ చేసేందుకు గాను, వాటి ద్వారా వచ్చిన బియ్యాన్ని తమిళనాడుకు పంపిస్తున్నామన్నారు.
దీనిపై అవగాహన లేకుం డా.. సరైన సమాచారం తీసుకోకుండానే కొంతమంది చిలువలు, పలువలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా నుంచి కేవలం నాలుగు ర్యాకుల్లో 15వేల టన్నులు మాత్రమే ఇప్పటివరకు తమిళనాడుకు పంపితే, లక్షల టన్నులు పంపినట్లుగా ప్రచారం చేయడం అవివివేకమన్నారు. మిల్లర్లు ఎప్పుడు కూడా వ్యవహరించలేదని, భవిష్యత్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయబోరన్నారు. ప్రధాన కార్యదర్శి కరుణాకర్ మాట్లాడుతూ, రైస్ ఇండస్ట్రీపై ఆధారపడి వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని, అసత్య ప్రచారంతో వారందరికీ ఇబ్బందులు ఏర్పడే ప్రమాదముందన్నారు.
ఒక్కో మిల్లులో 5కోట్ల నుంచి 50 కోట్ల విలువైన మిషన్స్ ఉన్నాయని, తాము ఎక్కడికి వెళ్లేవాళ్లం కాదని, ఇటు ప్రభుత్వానికి అటు రైతులకు అనుసంధానంగా నిబంధనలకు లోబడి మిల్లలు నడుతుపుతున్నామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గమనించి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిల్లు లోపలికి వచ్చే ధాన్యం బస్తాలతోపాటు బయటకు వెళ్లే ప్రతి బియ్యం బస్తాకు అధికారిక లెక్కలుంటాయని, అందులో ఎక్కడా నిబంధనలు విస్మరించడానికి అవకాశం ఉండదన్న విషయాన్ని గుర్తించాలని, రైస్మిల్లర్లపై దుష్పప్రచారం మానుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు బోయినపల్లి ప్రభాకర్రావు, వేణు,ప్రతినిధులు పాల్గొన్నారు.