మంథని/ కొత్తపల్లి/ హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి 10: భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు ఆనందంలో మునిగితేలారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి సంబురాలు జరుపుకొన్నారు. కరీంనగర్లో టీఎన్టీవోస్ కేంద్రం సంఘం కార్యదర్శి మారం జగదీశ్ నేతృత్వంలో నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
హుజూరాబాద్ అంబేద్కర్ పీవీ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. జగిత్యాలలో బీజేపీ నాయకులు పీవీ చిత్రపటంవద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పీవీ నర్సింహారావు విగ్రహానికి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పాలాభిషేకం చేశారు. అనంతరం పీవీ దేశానికి చేసిన సేవలను శ్లాఘించారు.