వ్యసనాలకు బానిసైన యువకులు, వివిధ నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో మార్పుతేవడం, రుణయాప్ల మోసాలు, సైబర్ క్రైం ఘటనలు, కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కరీంనగర్ పోలీసు కమిషనరేట్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 3న ప్రేరణ 2023 పేరిట అల్ఫోర్స్ విద్యాసంస్థలు, శియాన్ మీడియా సంస్థల సహకారంతో అల్గునూర్ ఉన్నతి కన్వెన్షన్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. వివిధ రంగాల్లో ఉన్నతులుగా ఎదిగిన వారి జీవితగాథలతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి అవగాహన కల్పించడంతోపాటు కమిషనరేట్ వ్యాప్తంగా లక్షమందికి ఎల్ఈడీ స్క్రీన్లపై లైవ్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
రాంనగర్, మార్చి 1: నేటి సమాజంలో యువత, విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన మెజార్టీ వ్యక్తులు వ్యసనాలకు బానిసగా మారుతున్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ అనారోగ్యం బారినపడుతున్నారు. ఇంకా రుణయాప్ల మోసాలు, సైబర్ క్రైమ్కు బలవుతున్నారు. ఇలాంటి వారిలో మార్పు తేవడమే లక్ష్యంగా కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ‘ప్రేరణ 2023’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో సక్సెస్ సాధించిన వారి జీవిత గాథలపై అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేందుకు ఈ నెల 3న అల్గునూర్లోని ఉన్నతి కన్వెన్షన్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
యువత మేలు కోరే కార్యక్రమం: సీపీ సుబ్బారాయుడు
యువతను సన్మార్గంలో నడిపించి, భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రేరణ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీ సుబ్బారాయుడు తెలిపారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివరాలు వెల్లడించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు ఉన్నత చదువులు చదివి గొప్పస్థాయికి ఎదగాలని తల్లిదండ్రులు కష్టపడుతుంటే యువత, విద్యార్థులు లక్ష్యాన్ని పక్కన పెట్టి జల్సాలకు అలవాటుపడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇంకా సమయానికి చేతిలో డబ్బులు లేక ఆన్లైన్ లోన్ యాప్లో రుణాలు తీసుకుంటూ సదరు సంస్థల చేతుల్లో మోసపోతున్నారన్నారు.
తీసుకున్న లోన్కు అధికవడ్డీ తీసుకోవడంతోపాటు చెల్లించకపోతే కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వారికి ఫోన్లు చేయడం, వ్యక్తిగత ఫొటోలు బహిర్గతం చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. సంస్థల వేధింపులు భరించలేక ఇటీవలి కాలంలో ఎంతో మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా దుర్వినియోగం కూడా పెరిగిపోతున్నదని, పలు రూపాల్లో ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయన్నారు. వీటన్నింటిపై అవగాహన కల్పించి చైతన్యం తేవడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, పీ ప్రతాప్, ఎస్బీఐ జీ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు లక్ష్మీబాబు, దామోదర్ రెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
లక్ష మంది వీక్షించేలా కార్యక్రమం..
అల్గునూరులోని ఏఎమ్మార్ ఉన్నతి కన్వెన్షన్లో నిర్వహించే కార్యక్రమంలో కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ కాలేజీలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు, వివిధ రంగాల్లో సక్సెస్ సాధించిన ప్రముఖులతో అవగాహన కల్పించనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో జూమ్ యాప్ ద్వారా లక్షమందిని భాగస్వామ్యం చేసేలా కళాశాలలు, వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడీ స్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
తరలిరానున్న ప్రముఖులు
ప్రేరణ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించనుండగా, రంగాల్లో సక్సెస్ సాధించిన ప్రముఖులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, మానసికవేత్తలు తరలిరానున్నారు. ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్, నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్, అనీల్ రాచమల్ల, మిథున్ కుమార్, కే అంకిత్, గంప నాగేశ్వరరావు, కెప్టెన్ మధుసూదన్ రెడ్డి, తోట మురళి తదితరులు హాజరై వివిధ రకాల అంశాలపై అవగాహన కల్పించనున్నారు.