రాంనగర్, అక్టోబర్ 21: సమాజంలో శాంతి స్థాపన కోసం అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే)ను పురసరించుకొని శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో స్మృతి పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ డాక్టర్ బీ గోపి, రాజన్న జోన్ డీఐజీ కే రమేశ్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, పోలీసు అమరవీరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు.
అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 47 మంది పోలీసులు అసాంఘిక శక్తులపై జరిపిన పోరులో ప్రాణత్యాగం చేశారని వివరించారు. పోలీసు అమరవీరుల కుటుంబాల సమస్యలను పరిషరిస్తున్నామని వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. శోక్ శస్త్ ద్వారా పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. గత 2022 అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం ఆగస్టు ఒకటి వరకు దేశవ్యాప్తంగా ప్రాణాలర్పించిన 189 మంది పోలీసుల పేర్లను ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ (పరిపాలన) సీ రాజు చదివి వినిపించారు.
అమరవీరుల స్మారక స్తూపం వద్ద అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబాలకు చెందిన సభ్యులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్మృతి పరేడ్కు ఆర్ఐ ఎం సురేశ్ కమాండర్గా వ్యవహరించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెందిన సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఏ లక్ష్మీనారాయణ (శాంతిభద్రతలు), సీ రాజు (పరిపాలన) ఏసీపీలు, నరేందర్, కరుణాకర్ రావు, జీవన్ రెడ్డి, కాశయ్య, మాధవి, శ్రీనివాస్, విజయకుమార్, ప్రతాప్, సర్వర్, వేణుగోపాల్, ఎస్బీఐ వెంకటేశ్తో పాటు పలువురు పోలీసు అధికారులు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.