రాంనగర్, అక్టోబర్ 15: ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కరీంనగర్ పోలీసు కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు ఆదివారం పేర్కొన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో వర్గ వైషమ్యాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్లపైనా నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. జిల్లాలో విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 883 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు.
సుమారు రూ. 4,50,063 విలువ చేసే లిక్కర్, అలాగే రూ.48,18,958 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 79 నాకా బందీలు నిర్వహించినట్లు తెలిపారు. 69 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్ అయ్యాయని చెప్పారు. నిర్ణీత సమయంలో ఆయుధాలు డిపాజిట్ చేయని వారిపై సెక్షన్ 188 ఐపీసీ కింద, ఎన్నికల నియామవళి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.