కరీంనగర్ రాంనగర్, జూన్ 22: పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు మరో ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. అందులో ఒకరు సూర్యమణి అలియాస్ సనోజ్ కుమార్ను రామడుగు మండలం ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఓ తుపాకీతోపాటు మ్యాగజైన్, దోపీడీ సమయంలో వినియోగించిన బట్టలు, బూట్లను స్వాధీనం చేసుకొని, సోమవారం కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. మరో నిందితుడి ఎండీ ఆదిల్ఖాన్ను బిహార్ రాష్ట్రంలోని పాట్నా పరిధిలోని పుల్వారి షరీఫ్ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బృందం అదుపులోకి తీసుకున్నది.
అక్కడి కోర్టు అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ ద్వారా రెండు రోజుల్లో కరీంనగర్కు తీసుకురానున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులు, సహకారం అందించిన వ్యక్తులతో కలిపి మొత్తం ఎనిమిది మందిని పట్టుకున్నారు. సూత్రధారి సుబోధ్సింగ్తోపాటు దోపీడీలో పాల్గొన్న రఘునాథ్ కర్మాకర్, రవిశ్కుమార్, నగదు సమకుర్చిన అమర్సింగ్, తుపాకులు అందించిన యాదవ్ను అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. మొదటిసారి సుబోధ్సింగ్, రఘునాథ్ కర్మాకర్, రవిశ్కుమార్ను కస్టడీలోకి తీసుకొని విచారించినా.. పోలీసులు వారి నుంచి స్పష్టమైన సమాచారం రాబట్టలేకపోయారు. వారితోపాటు మరో ఇద్దరు నిందితులను ఈనెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. రెండోసారి సైతం దొంగలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిసింది.