చిగురుమామిడి, ఏప్రిల్ 10: ‘మోసమే కాంగ్రెస్ నైజం. ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలకు ఎగనామం పెట్టింది’ అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ నిప్పులు చెరిగారు. ఐదేండ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఐదు పైసలు కూడాతేలేదని దుయ్యబట్టారు. బుధవారం ఉదయం ఆయన హుస్నాబాద్లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వాకర్లతో ముచ్చటించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వినోద్ మాట్లాడారు. డిసెంబర్ 9న రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్, నాలుగు నెలలు దాటినా ఆ ఊసే ఎత్తడంలేదన్నారు.
2 లక్షల ఉద్యోగాల హామీ ని తుంగలో తొక్కారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, సాగునీరు లేక పంట ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాను కరీంనగర్ ఎంపీగా ఐదేళ్లలో కేంద్రంతో కొట్లాడి జాతీయ రహదారులు, రైల్వే లైన్లు మంజూరు చేయించానని చెప్పారు. ప్రస్తుత ఎంపీ ఈ ప్రాంత అభివృద్ధికి నయాపైసా తేలేదని దుయ్యబట్టారు. ఆయన ఓట్ల కోసం ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. కేంద్రం వివిధ పథకాల కింద అన్ని రాష్ర్టాలకు నిధులిస్తుందని, కానీ సంజయ్ ఈ నిధులను తానే తెచ్చానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.
రాష్ట్రం లో 33 జిల్లాలకు తొమ్మిదే నవోదయ స్కూళ్లు ఉన్నాయని, ఐదేళ్లలో బండి ఒక్క నవోదయ స్కూల్ కూడా మంజూరు చేయించలేదన్నారు. హుస్నాబాద్ ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ప్రజల గొంతుకగా పార్లమెంట్లో తన వాణిని వినిపిస్తానని స్పష్టం చేశారు. హుస్నాబాద్కు నవోదయ స్కూల్ను తీసుకువస్తారని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పసిడి పంటలతో సస్యశ్యామలంగా ఉన్న కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇప్పుడు సాగునీరులేక ఏడారిని తలపిస్తున్నదని ఆవేదన చెందారు.
అసెంబ్లీ ఎన్నికల ముందర కాంగ్రెస్ అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టిందని, మళ్లీ ఇప్పుడు మోసం చేసేందుకు తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నదని విమర్శించారు. వినోద్ కరీంనగర్ ఎంపీగా అనేక అభివృద్ధి పనులు చేశారని, కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా తెచ్చారని, రైల్వేలైన్లు, జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు. అభివృద్ధి కావాలంటే ప్రజలు ఆలోచించి ఓటేసి వినోద్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వారి వెంట హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్పర్సన్ అనిత, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్వర్ పాషా, కౌన్సిలర్లు రవి, శ్రీనివాస్, సుప్రజ, రాజు, రవీందర్ రావు, మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య ఉన్నారు.