కార్పొరేషన్, నవంబర్ 5: సెక్యులర్ ప్రభుత్వాన్నే గెలిపించాలని, బీజేపీ మత రాజకీయాలతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని, నగరంలోని మైనార్టీల అభ్యున్నతి కోసం పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం నగరంలోని 4, 5, 27 డివిజన్లల్లో విసృత్త ప్రచారం సాగించారు. మంత్రికి మైనార్టీ నాయకులు, ప్రజలు భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ఈ పదేండ్ల కాలంలో శాంతియుతంగా అన్ని మతాల ప్రజలు గౌరవంతో ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు.
4, 5, 27 డివిజన్లల్లో గతంలో ఉన్న రోడ్లు, మురుగు కాల్వల సమస్యలన్నింటిని పరిష్కరించామన్నారు. రోడ్లను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే ముందుకు సాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
నగరంలో రాత్రిళ్లు అద్భుతంగా జిగేలుమనే వెలుగులు కనిపిస్తున్నాయన్నారు. నగరాభివృద్ధి కోసం రూ. వేల కోట్ల నిధులు తీసుకువచ్చి నగరం రూపురేఖలు పూర్తిగా మార్చివేశామన్నారు. కేబుల్బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రంలోనే గొప్ప నగరంగా మారుతుందన్నారు. గత మూడు ఎన్నికల్లో మైనార్టీలు తనకు అండగా నిలిచి గెలిపించారని పేర్కొన్నారు. వారి మద్దతు ఎప్పటికీ మరిచిపోమన్నారు.
వారి రుణం తీర్చుకునే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు. ఎక్కడా కూడ మట్టి రోడ్డు అనేది లేకుండా చేసి ప్రజలు ఇబ్బందులు తొలిగించామన్నారు. ఈ ఎన్నికల్లో కూడా మైనార్టీలు మరోసారి ఆశీర్వదిస్తే ఈ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీల ఆడబిడ్డల పెళ్లిలకు షాదీముబారక్ కింద రూ.లక్ష అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. ఇలాంటి పథకాలు మరిన్నీ రావాలంటే కారు గుర్తునే గెలిపించాలన్నారు. మీ బిడ్డగా, మీ మధ్యనే ఉండే తనకు అండగా ఉండి గెలిపిస్తే మరిన్నీ ప్రాజెక్టులు తీసుకొస్తానన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీతో తనకు ఉన్న 15 ఏళ్ల స్నేహాన్ని ‘యే దోస్తీ హమ్ నహీ చోడోంగే’ అంటూ పాట పాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, నాయకులు మాజిద్, షౌకత్, అలీ, మైనార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.