కరీంనగర్ కళోత్సవాలకు వేళయింది.. బతుకమ్మ, దసరా పండుగల వేళ మూడు రోజుల పాటు కనువిందు చేసే వేడుకలకు మరి కొద్ది గంటల్లో తెరలేవబోతున్నది.. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు కళల కాణాచి అయిన కరీంనగర్ ఖ్యాతిని చాటేలా నిర్వహించే ఈ కార్యక్రమాలకు అంబేద్కర్ స్టేడియం ముస్తాబైంది.. ముందస్తుగా గురువారం రాత్రే క్రాకర్ షో జిగేల్మనిపించింది.. క్యాంప్ఫైర్ ఉర్రూతలూగించింది.. మూడు దేశాలు, 20 రాష్ర్టాల నుంచి కళాకారులు ఇప్పటికే నగరానికి చేరుకోగా, గురువారం రాత్రి మేయర్ సునీల్ రావు, నిర్వాహకులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ స్వాగతం పలికారు. జాతీయ గీతాలపన చేసిన అనంతరం మినీ స్టేడియం ఎదుట ఏర్పాటు చేసిన క్రాకర్ షో, క్యాంప్ ఫైర్ ప్రారంభించారు. అంతకుముందు కళోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 29 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం కరీంనగర్ కళోత్సవాలకు ముస్తాబైంది. మూడు రోజులపాటు ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించనుండగా, అందుకు అంతా సిద్ధమైంది. వేడుకలను ఒకేసారి 20 వేల మందికి పైగా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. గురువారమే మూడు దేశాలు, 20 రాష్ర్టాల నుంచి కళాకారులు నగరానికి చేరుకోగా, వారి కోసం ప్రత్యేకంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. కళోత్సవాల ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. స్థానిక అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. జిల్లాకు చేరుకున్న కళాకారులు నాగదుర్గ బృందం రిహార్సల్స్ను ఆయన మేయర్ సునీల్రావు, అధికారులతో కలిసి వీక్షించారు.
అలరించిన క్రాకర్షో, క్యాంప్ఫైర్..
వేడుకల ప్రారంభానికి ముందు గురువారం రాత్రి అంబేద్కర్ స్టేడియంలోని మినీ స్టేడియం ఎదురుగా ఏర్పాటు చేసిన క్రాకర్ షో, క్యాంప్ ఫైర్ అలరించాయి. అంతకు ముందు కళాకారులు స్టేడియం వద్దకు రాగా డప్పు చప్పుళ్ల మధ్య మంత్రి గంగుల, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణీ హరిశంకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు మాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇజ్రాయిల్, అండమాన్ నికోబార్, అసోం, ఒడిశా, మహారాష్ర్ట, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా, ఢిల్లీ ఇలా హాజరైన అన్ని రాష్ర్టాల కళారులు తమతమ రాష్ర్టాల సంప్రదాయ గీతాలపై నృత్యాలు చేశారు.
నేటి కార్యక్రమాలివే..
కళోత్సవాల్లో భాగంగా, మొదటి రోజు అతిథులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత, ఒల్లాల వాణి పాడిన ‘ఏ తల్లి పిల్లాడో’ పాటతో ఉత్సవాలు ప్రారంభమై, మంగ్లీ, మిట్లపల్లి సురేందర్, మధుప్రియ, మౌనిక యాదవ్, జోగుల వెంకటేశ్, శేఖర్ వైరస్, అనిల్ గిల్ల, జానులిరి, నాగరుద్ర, హారిక, బుల్లెట్ భాస్కర్ ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ, అనిల్, కొమురవ్వ, రాధాకృష్ణ ప్రదర్శనలతో పాటు మొత్తం 23 ప్రదర్శనలు ఉంటాయి.
మన కళలను గౌరవించేందుకే..
తెలంగాణతో పాటు కరీంనగర్ కళలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కళోత్సవాలు నిర్వహిస్తున్నాం. మన జిల్లా కవులు, కళాకారులకు పుట్టినిల్లు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే కళాకారులకు మన కళలను పరిచయం చేయడంతోపాటు మూడు దేశాలు, 20 రాష్ర్టాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలను మూడు రోజులు పాటు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. వేడుకల్లో భాగంగా ప్రతి రోజూ 30 కార్యక్రమాలు ఉంటాయి. చివరి రోజు 2వ తేదీన జ్యోతిరావు ఫూలే మైదానంలో శోభాయాత్ర ఉంటుంది. జిల్లా వాసులు ఉత్సవాలను వీక్షించాలి. – గంగుల కమలాకర్, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి