కరీంనగర్ కార్పొరేషన్, మే 28 : ప్రజలకు పరిశుభ్ర వాతావరణంలో ఒకే చోట కూరగాయలు, మాంసాహారం, ఇతర సామగ్రి విక్రయాలు ఉండాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్లోని పద్మనగర్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్పై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. వినియోగంలోకి తీసుకురావడంలో అధికారయంత్రాంగం, నగరపాలకవర్గం అలసత్వం చూపుతున్నది. రూ.14 కోట్ల స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన ఈ ఇంటిగ్రేడెట్ మార్కెట్ను గతేడాది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ప్రారంభించారు. అన్ని సౌకర్యాలతో ఉన్న ఈ మార్కెట్ను వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. అయితే, ఏడాది దాటిపోయినా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ప్రారంభోత్సవానికే పరిమితమైందే తప్పా ఎలాంటి విక్రయాలు జరగడం లేదు. మార్కెట్ ప్రారంభోత్సవానికి ముందే లబ్ధిదారులను ఎంపిక చేసి అందులో కూరగాయలు, మాంసం మార్కెట్ ప్లాట్ఫాంలు, మార్కెట్లోని పలు షెటర్లను అప్పగించినట్టు నగరపాలక అధికారులు చెప్పారు.
కానీ, నేటికీ దానిని వినియోగంలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు మాత్రం చేయలేదు. ఫలితంగా పరిశుభ్రమైన వాతావరణంలోనే కూరగాయాలు, మాంసం మార్కెట్లు ఉండాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. నగరంలో ఇప్పటికీ రోడ్ల పక్కన అపరిశుభ్రతా వాతావరణంలోనే కూరగాయల విక్రయాలు సాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్కు సైతం తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. విమర్శలు వెల్లువెత్తినప్పుడల్లా ఏదో రెండు రోజులు రోడ్లపై అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు హడావుడి చేయడం.. ఆ తర్వాత ఆయా వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకొని యథాస్థితిని కొనసాగించడం అలవాటుగా మారిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోకి వ్యాపారులను తరలించడంపై అధికారయంత్రాంగం, నగరపాలకవర్గం కనీస ప్రయత్నాలు చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది.