కరీంనగరం మెరుస్తున్నది. వీధివీధినా ప్రగతి పనులతో మురిసిపోతున్నది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల ప్రత్యేక కొద్దిరోజులుగా నగరంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేస్తుండగా ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తున్నది. ఒకటికాదు రెండు కాదు క్షణం తీరిక లేకుండా వారం రోజుల్లోనే ఏకంగా 50 డివిజన్లలో రూ.133కోట్ల పనులకు శ్రీకారం చుట్టడమే కాదు నెల రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేయగా, యంత్రాంగం రంగంలోకి దిగింది. పనులను పూర్తి నాణ్యతతో వేగంగా చేపడుతుండగా, నగర ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– కార్పొరేషన్, అక్టోబర్ 8
కార్పొరేషన్, అక్టోబర్ 8: కరీంనగర అభివృద్ధిపై మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే వందలాది కోట్లతో పనులు చేయించి, నగర రూపురేఖలే మార్చివేసిన ఆయన, మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నగరంలోని 60 డివిజన్లలో సుడిగాలిలా పర్యటనలు చేస్తున్నారు. ఎక్కడ విశ్రాంతి అనేది లేకుండా పార్టీ కార్యక్రమా లు, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనిటీ భవనాల కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యమిచ్చి మంత్రి ప్రతి డివిజన్కు వస్తున్నారు. సీఎం అస్యూరెన్స్ కింద విడుదలైన రూ.133 కోట్లతో వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేస్తున్నారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తుండడంతో అధికారులు వేగం పెంచారు. వచ్చే నెల రోజుల్లో పూర్తి చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లు ఉండగా రూ.133 కోట్లతో అభివృద్ధి పనులను ఒకే ప్యాకేజీ కింద చేపడుతున్నారు. ప్రగతి పనులను గత సెప్టెంబర్ 30న స్థానిక కోతిరాంపూర్లో శ్రీకారం చుట్టిన మంత్రి గంగుల, ప్రతి రోజూ 5 నుంచి 6 డివిజన్లలో పర్యటించి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. కేవలం ఏడు రోజుల్లోనే 50 డివిజన్లలో సుడిగాలి పర్యటనలు చేసి 71 కార్యక్రమాల్లో పాల్గొని, రూ.133 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతి డివిజన్లో సుమారుగా రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల పనులు చేపడుతున్నారు. ఓ వైపు కొత్త పనులకు భూమిపూజ చేయడంతోపాటు ఇప్పటికే పూర్తయిన పనులను ప్రారంభిస్తున్నారు.
ఇందులో ప్రధానంగా గోదాంగడ్డలో రూ.2 కోట్లతో నిర్మించిన ఆధునిక దోభీఘాట్ను ప్రారంభించి, రజకులకు అందుబాటులోకి తెచ్చారు. శాతవాహన యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన నైట్ పుడ్ బజార్ను ప్రారంభించారు. గిద్దెపెరుమాండ్ల దేవాలయ మైదానంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, లైటింగ్, మానేరు డ్యాం సమీపంలో, ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాకులు, లైటింగ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అలాగే నగరపాలక సంస్థ నుంచి సుమారుగా రూ.3.50 కోట్లతో అభివృద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే కఠారి దేవేందర్రావు (కేడీఆర్) పార్కును ప్రారంభించారు. తన పర్యటనలో మొదటి రోజు 8 డివిజన్లలో, రెండో రోజు 7, మూడో రోజు 11, నాలుగో రోజు 3, ఐదో రోజు 7, ఆరో రోజు 6, ఏడో రోజు 8 డివిజన్లలో పర్యటించి పనులకు అంకురార్పన చేశారు. మరో పది డివిజన్లలో పర్యటిస్తే సంపూర్ణం కానుండగా, నేడో, రేపో పూర్తికానున్నది.
మంత్రి గంగుల గత వారం పది రోజులుగా నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పనులకు భూమిపూజ చేయడంతో పాటు వాటిని వేగంగా పూర్తి చేసేందుకు దృష్టి సారిస్తున్నారు. అంతేకాదు పనులు ప్రారంభిస్తున్న టైంలోనే నెల రోజుల్లో పూర్తిచేస్తామని అక్కడి ప్రజలకు హామీలు కూడా ఇస్తున్నారు. ఆయా డివిజన్లలో తమకు కావాల్సిన పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే అధికారులతో అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేయించి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు.