సిరిసిల్ల టౌన్, జూన్ 21: ఐదో విడుత పల్లెప్రగతి విజయవంతం కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో మంగళవారం సంబురాలు నిర్వహించారు. జిల్లా సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు సర్పంచులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే మార్గదర్శకంగా నిలిచారన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమన్నారు. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అన్న నానుడిని నిజం చేసిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు.
ప్రతి నెలా రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి తేవాల్సిన నిధులను సాధించడంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరి కాదన్నారు. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేవూరి వెంకట్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చల్ల నారాయణ, సర్పంచులు శివజ్యోతి, గోపాల్రావు, రాజిరెడ్డి, బాల్రెడ్డి, కిషన్రావు, రాంరెడ్డి, జవహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.